పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

482

సింహాసన ద్వాత్రింశిక


ఉ.

అంబుజమిత్రు నంశ మని యార్యులు సన్నుతి సేయఁగా సము
ద్రంబులు నాల్గుమేర లగు ధారుణి యంతయు నేలుచుం బ్రతా
పంబున రాజు లెల్లఁ దన పంపు చరింపుచుఁ గొల్వఁ గార్యఖ
డ్గంబుల వైరులం దునిమె గట్టిగ సత్యము నిల్పుకోరికిన్.

81


సీ.

సత్త్వంబుననె మహాశ్చర్యంబుగా గెల్చి
        వసుధేశులను నాత్మవశులఁ జేసి
వరరత్నకనకాది వస్తువు లన్నియుఁ
        దనసొమ్ముగాఁ జేసికొని యతండు
హయమేధములు మొదలైన యాగములందు
        గూడి దేవతలెల్లఁ దోడుపడఁగ
బడుగులు వేఁడినఁ బ్రాణంబు లైనను
        వంచింప కొసఁగెడు వ్రతము వట్టి


ఆ.

సర్వదిక్కులందుఁ జాటించి యర్థులఁ
గూడఁ దిగిచి వారు గోరినట్ల
యూళ్ళు నర్థమును యథోచితంబుగ నిచ్చి
శాసనంబుగాఁగ శక మొనర్చె.

82


వ.

భువిలో నభూతపూర్వంబు నద్భుతంబు నగుకృత్యంబు శకం బనంబడుఁ. దొల్లి జరుగు శ్రీరామశకంబు యుధిష్ఠిరశకంబు నణంచి నిజశకంబు నిల్పిన నందానందాది సంవత్సరాద్యమ్మున విక్రమార్కశకంబై చతుర్లక్షజ్యోతిశ్శాస్త్రగతి ప్రవర్తకం బయ్యె.

83


ఆ.

నడుమ శాలివాహనశకంబు గలిగియుఁ
జెడక యుత్తరమునఁ బుడమిలోన
నెన్ని చూడఁ బదియు నెనిమిది వేలేఁడు
లతనిశకము రూఢి నలరఁగలదు.

84