పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

సింహాసన ద్వాత్రింశిక


నడవిఁ జొచ్చినంత యక్షులకృపఁ జేసి
రాజశేఖరునకు రాజ్యమయ్యె.

74


రాజశేఖరునికథ

ఉ.

నావుడు రాజశేఖరుఁడు నా నతఁ డెవ్వఁడు యక్షదైవసం
భావన యెట్లు గల్గె జనపాలక! యాకథఁ జెప్పు మన్న నా
భూవరుఁ డిట్లనున్ ద్రవిళభూమివరుం డతఁ డాజి శత్రులం
బ్రోవులుగా నొనర్చి సిరి వొందఁగ రాజ్యము సేయుచుండగన్.

75


ఉ.

నొచ్చినవారి సూను లగునూర్వురు రాజులు దండుగూడి పై
వచ్చినఁ గోటలోనఁ బరివారము గొంచెము గావున న్వడి
న్విచ్చి చనంగ నానృపతి వేగమ పత్నియుఁ దానుఁ గానలోఁ
జొచ్చి నిగూఢమార్గమున సుక్కుచుఁ గందుచు లోనఁ గుందుచున్.

76


ఉ.

అక్కడఁ బ్రొద్దు గ్రుంకఁగ మహావటవృక్షముఁ జేరి విన్ననై
చెక్కిటఁ జేయిఁ జేర్చి తనచేడియ చింత మునుంగ నాత్మలోఁ
బొక్కుచు నిద్రలేక తలపోయఁగ నానడురేయి వింతగా
నెక్కటి మఱ్ఱిమీఁద గల యేవురు యక్షులు కార్యదక్షులై.

77


చ.

మనకు విహారదుర్గ మగు మద్రపురంబున కీశుఁ డైన యా
జనపతి నిన్నఁ జచ్చె మఱి సంతతి లేదు తదీయరక్ష కె
వ్వని నిఁక నిల్పి రాజ్యసుఖవైభవ మిత్తము చెప్పుఁ డంచు నే
ర్పునఁ దమలోనఁ గూడి తలపోయుచునుండఁగ నొక్కఁ డిట్లనున్.

78


ఉ.

ఇంతవిచార మేల మన కీవటవృక్షముక్రింద నున్న భూ
కాంతుని నప్పురంబునకు గర్తగఁ జేయుద మెల్లి నావుడున్
సంతసమంది యందఱును సమ్మత మౌ నిది యంచుఁ బల్కినం
జింత దొఱంగి యానృపతి చెల్వయుఁ దానును నుల్లసిల్లగన్.

79