పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

281


ఉ.

ఆకమలాప్తసూతుఁ డుదయాద్రికిఁ జేరుచుఁ దూర్పుదిక్కునం
జేకొని కెంపుగుంపు గొనఁ జేయుచుఁ దారల పెంపు డింపఁగా
జీకటి రాజశేఖరుని చీకటితోడన కూడి పాయఁగా
నాకడ యక్షు లాతనికి నప్పురమార్గముఁ జెప్పి యంపఁగన్.

80


ఉ.

భాస్కరుఁ డంతలో నుదయపర్వత మెక్కఁగ భూవిభుండు శ్రే
యస్కరి యైనలక్ష్మిక్రియ యంగనతోడుగ నేగి కానలోఁ
దస్కరమార్గము ల్గడచి దవ్యులఁ [1]గాంచెఁ దటాంతకీలితా
హస్కరరత్నజాలవలయం బగుయక్షవిహారదుర్గమున్.

81


ఉ.

ఆనగరంబుచేరువ వనాంతముఁ జొచ్చి సరోవరంబులో
స్నానము చేసి భాస్కరుని సౌరజపంబునఁ గొల్చుచుండఁగా
మానవు లెల్ల నెవ్వనికి మద్రపురాధిపతిత్వ మిత్తమం
చూనినచర్చనున్నయెడ నొయ్యన యక్షులు బుద్ధి గొల్పినన్.

82


క.

మదకరిణిచేతి కొకచ
క్కదనపు వనమాల[2] యిచ్చి కదలించినచో
నది యెవ్వని మెడ నిడియెను
విదితంబుగ నతఁడె మనకు విభుఁడౌ ననుచున్.

83


క.

అందఱు నొకమదహస్తిని
నందముగ నలంకరించి హస్తాగ్రమునం
జెందొవలదండ యిడి వే
డ్కం దూర్యధ్వనులు[3] చెలఁగఁ గదలించినచోన్.

84


క.

జంభారి నెదురుకొనఁ జను
కుంభీంద్రునితోడి పిడియొకో యిది యనఁగాఁ

  1. గాంచెను రత్నకారితాహస్కరరత్నరాజినిలయంబగు
  2. చక్కద మగువనమాల
  3. వెనుకం దూర్యధ్వనులు