పుట:సర్పపురమాహాత్మ్యము (కూచిమంచి తిమ్మన).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నలరె రఘువర భృగువర నల దిలీప, సగర పురుకుత్స శిబి హరిశ్చంద్ర నహుష
భరత శశిబిందు నిభశుభప్రాభవుండు, నయవిదుండు నికుండభూనాయకుండు.

17


తే.

అమ్మహీపతిమణి తండ్రి యట్ల ప్రజలఁ, బ్రోదిసేయుచు నక్షత్త్రభోగలీలఁ
బీఠికాపట్టణంబు సంప్రీతితోడ, నేపు దైవాఱ నెమ్మది నేలుచుండె.

18


సీ.

దేవదేవుండు కుంతీమాధనస్వామి, దలఁగ కేపురమున నిలిచియుండె
దివిజనాయక సంప్రతిష్ఠితుం డై కుక్కు, టేశ్వరుఁ డేవీట నిరవుకొనియెఁ
బృథుతరాష్టాదశపీఠంబులకుఁ బెద్ద, పురుహూతికాంబ యేప్రోల వెలసెఁ
బరమపావన మైన పాదగయాక్షేత్ర, మేరాజధానియం దేపు మీఱె


తే.

సేతుకాశీప్రయాగాద్యశేషదివ్య, తీర్థరాజంబులట్ల ప్రతిష్ఠఁ గాంచె
నేమహాపట్టణం బది యెన్న నలరు, భువనసారంబు పీఠికాపురవరంబు.

19


సీ.

వివిధశాస్త్రపురాణవేదవేదాంతసం, విదులయి వెలసిన విప్రవరులు
హయమతంగజశతాంగారోహణక్రియా, ప్రౌఢి గాంచిన మేటిబాహుజులును
ధనధాన్యవిస్ఫూర్తి దానవిద్యాభ్యాస, పారీణులైనట్టి యూరుజులును
బాఁడిపంటలచేత భాగ్యసంపన్నులై, సుస్థితి నలరొందు శూద్రజనులు


తే.

మఱియుఁ గొదలేనికలుములఁ గొఱలి వఱలు, నితరవర్ణజనంబులు నతితరముగఁ
గలిగి యేప్రొద్దు శుభలీలఁ జెలఁగుచుండు, భూరివిభవంబు పీఠికాపురవరంబు.

20


క.

ఆనగరి కధీశ్వరుఁడై, పూనిక నిప్టోపభోగములఁ దనియుచు ధా
త్రీనాథమణి నికుండుం, డానగరిపుకరణి ఠీవి నలరుచు నుండెన్.

21

శరద్వర్ణనము

శా.

అంతన్ భ్రాంతసరస్సమగ్రబిసనాళాహారలీలాపరి
భ్రాంతానంతమరాళికానిచయసుశ్రావ్యస్వనాకర్ణనా
శ్రాంతాత్యంతకుతూహలోల్లసితభాస్వచ్ఛాలిపాలీజన
స్వాంతం బై శరదాగమంబు దనరెన్ సర్వంసహామండలిన్.

22


సీ.

విమలపయోదఖండములు మింటఁ జరించె, కలమమంజరులెల్లఁ దలలు వంచెఁ
గొలఁకుల నలినముల్ గలువలు వికసించె, మదమరాళంబుల రొదలు మించె
వృషభగుల్ ఱంకెలు వేయుచు నెదిరించె, శైవలినీతతుల్ సన్నగించెఁ
గేకిసంఘాతంబు కేకలు చాలించెఁ, బొనఁగఁ ద్రోవలను రొంపులు నశించె