పుట:సత్యభామాసాంత్వనము.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

97

     కాముఁడు వే ఱాయెనొకో
     భూమిని గంసారి యిన్నిబూమెలు గలవే.

క. మదిరాక్షి పేరు నుడువకు
     మొదటన్ రుక్మిణియు వినిన మోసం బగుఁగా
     యదె ప్రద్యుమ్నుఁడు వచ్చెను
     పదిలము పదిలంబు వికచపంకజనయనా.

సీ. చామ యంటివ దేమి సామి చేలను గాక
                    చామ యీశిబిరంబు చాయఁగలదె
     లతకూన యంటి శ్రీపతి తోఁటలోఁ గాక
                    లతకూన పటకుటీవితతిఁ గలదె
     కొమ్మ యంటివి హరి కుజములందునె కాక
                    కొమ్మ యాయోధనక్షోణిఁ గలదె
     [1]నారి యంటి వదేల శౌరి వింటను గాక
                    నారి నాసీరకోణమునఁ గలదె
తే. ముద్దుగు మ్మంటి వది యేమి ప్రొద్దు పోదె
     మొదవుచంటను గాక యిం దొదవ దరుదు
     చెంద మాటాడుదురె యిట్టిమందెమేల
     మందమా చందమా గొల్లచందమామ.

సీ. ఏసాధ్వికోసమై యిలను సత్రాజిత్తు
                    గుట్టు పోనాడినతిట్టు గలిగె
     నేపుణ్యవతి నెంచఁ బృథ్వీశ్వరులలోన
                    నెలుఁగురాయల పట్టి నేల వలసె
     నేభాగ్యవతిఁ గోర నినుఁ డిచ్చుమణికినై
                    తొలుత నీపై వట్టిదూఱు పుట్టె
     నేసతిఁ బెండ్లాడ నెనయ రుక్మిణిచేత
                    వడిసుళ్ల నేప్రొద్దు జడియవలసె

  1. నారి యంటివి మేలు