Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్రము- II


సరసమనోహరములైన వర్ణనలతోడకు, మధుర గంభీరములైన భావములతోడను, మృదుమధురములైన పదముల తోడను, అద్భుతావహములైన శ్లేషచమత్కారముల తోడను, ఒహో అనిపించు యమకానుప్రాసాద్యలంకారములతోడను కూర్చి ఈ ప్రబంధమున వేంకటకవి కావించిన సృష్టి అనన్య సామాన్యమై అలరారుచుందును. రస పాత్ర పోషణమునను, సాభిప్రాయ పదప్రయోగమునను ఆతని కతడేసాటి. “ప్రతి పద్యమునందు చమత్కృతి కలుగగ చెప్పనేర్తు" వని రఘునాథుడే అనెనో అతడే వ్రాసికొనెనో కాని అం దిసుమంతయు నతిశయోక్తి కానరాదు. శబ్దార్థాలంకారము అమితముగా వాడుచునే రసభావముల నద్వితీయముగా పోషించిన మహాకవు లాంధ్రవాఙ్మయమున నిర్వురే. ఒకడు భట్టుమూర్తి; రెండవవాడు వేంకటకవి. వేంకటకవి తెలుగుపదముల విరుపులలో భట్టుమూర్తికన్నను మిన్న అనిపించును. ఆతని పదప్రయోగ చాతుర్య మపూర్వమైనది. "క్షితిలో నీమార్గ మెవరికిన్ రా"దనుట సత్యము. ఇంతటి మహాకవి కావుననే రసిక శేఖరుడైన రఘునాథ భూపాలు డాతని నాదరించి మేదురములైన సత్కారము లాచరించినాడు.

రఘునాథుని ఆస్థానమున విద్వత్కవియై బహు గ్రంథములు రచించి వాని నన్నిటిని అతనికే అంకితము చేసినవాడు కృష్ణాధ్వరి. రఘునాథ భూపాలీయము, నైషథ పారిజాతావతారిక, కల్యాణ కౌముదీ కందర్ప నాటకము, శృంగార సంజీవని, తాళ చింతామణి, నైషధ పారిజాతీయము అను ఆరు గ్రంథములను రచించితినని అతడే చెప్పుకొని యున్నాడు. వీనిలో రఘునాథ భూపాలీయ నైషధ పారిజాతీయములు రెండే కానవచ్చు చున్నవి. ఇందు రఘునాథ భూపాలీయము ప్రతాప రుద్రీయమువలె కావ్య స్వరూప రసధ్వన్యలం కారాదులను తెల్పు లక్షణ గ్రంథము. ఇందు లక్ష్యములైన పద్యము లం దన్నిట రఘునాథుడే వర్ణింపబడి యున్నాడు. నైషధ పారిజాతీయము ద్వ్యర్థికావ్యము. ఇందు నలచరిత్రయు పారిజాతాపహరణ కథయు జోడింపబడినవి. సన్నిహిత సంబంధములేని ఈ రెండు కథలను సమానాంతరముగా సాగించుటలో ఈ కవి చూపిన నేర్పును పాండిత్యమును అనన్య సామాన్యములై యున్నవి. ద్వ్యర్థికావ్య నిర్మాణ నైపుణ్యమున నీతడు సూతన భట్టుమూర్తులను కూడ మించివాడని విమర్శకుల అభిప్రాయము. ఇతడు వ్రాసిన ఇతర రచనలు తెలుగు గ్రంథములో సంస్కృత గ్రంధములో తెలియరాదు. కృంగార సంజీవని అమరు కాహం కారహారియని ఆతడు తెల్పియున్నాకు. కల్యాణ కౌముదీ కందర్ప నాటకము బహుశః యక్షగానమై యుండవచ్చును. తాళ సంజీవని సంగీత శాస్త్రమునకు సంబంధించిన గ్రంధముగా తోచుచున్నది.

కాళయ్యకవి వ్రాసిన రాజగోపాల విలాసమను నైదా శ్వాసముల కావ్య మిటీవలనే ముద్రితమైనది. ఇది మన్నారుగుడి క్షేత్రమహాత్మ్యమును తెల్పు శృంగారరస ప్రధానమైన ప్రబంధము, ఇందు మొదటి నాలుగా శ్వాసములలో శ్రీకృష్ణునికి అతని అష్టమహిషులతోడి కూటమియు, పంచమాశ్వాసమున మన్నారుగుడి క్షేత్ర మాహాత్మ్యమును వర్ణింపబడినవి. కాళయ్య అష్టమహిషులను అష్టవిధశృంగార నాయికలుగా వర్ణించియున్నాడు. రుక్మిణి స్వీయ, సత్యభామ స్వాధీనపతిక, కాళింది ప్రోషిత భర్తృక, లక్షణ జారిణీ, జాంబవతి విప్రలబ్ధ. ఇతని రచనలో సంస్కృత పదములు హెచ్చు. ఈతని సమాసములు కొన్ని యెడల శ్రీనాథుని సమాసములను తలపించుచుండును. ఈతని ధారాశుద్ధి మిక్కిలి మెచ్చదగి యున్నది. మధుర తంజావూరు రాజ్యములందు వెలసిన శృంగార ప్రబంధముల కొక విధముగా ఈ రాజగోపాల విలాసము మార్గదర్శకమని చెప్పవచ్చును.

రఘునాథుని కుమారుడైన విజయరాఘవుడు కూడ కవియే. ఇతడు ప్రహ్లాద చరిత్ర పీఠిక యందు తాను పది కృతులను రచించినట్లు చెప్పుకొనియున్నాడు. అందు పెక్కు యక్షగానములు, పాదుకాసహస్రము, రమునాథా భ్యుదయము అనునవి ద్విపద కావ్యములు. మోహినీ విలాసము అను ద్విపద కావ్యముకూడ ఇతని రచనయే యని కొందరి తలపు. ఆత డా ద్విపదకృతిని యక్షగానముగా సంతరించినమాట సత్యము. కాని ఆకృతి యతడే రచించినదో ఇతరులు రచించినదో తెలియదు. ఈ ద్విపద కావ్యములలో రఘునాథాభ్యుదయ మొక్కటే ముద్రితమైనది. ఇందు విజయరాఘవుడు తన తండ్రి యగు రఘునాథుని రాజ్య వైభవమును, తంజా