ఆంగ్లభాషాసాహిత్యములు
వహించుటకు ప్రయత్నించి విఫలుడయ్యెను. రాయల సోదరులలో తిరుమలుడు, వెంకటాద్రి అనువారు సుప్రసిద్ధులు. నిజాంషా, కుతుబ్ షాలతోటి యుద్ధములందు అసహాయశూరుడని పేరువడసిన వెంకటాద్రి, రాక్షసి -తంగడియుద్ధమున వీరస్వర్గ మలంకరించెను. ఆ యుద్ధానంతరము, తిరుమలరాయలు చంద్రగిరిలో ఆరవీటి వంశమును స్థాపించి, జీర్ణకర్ణాట సామ్రాజ్య పునరుద్ధరణమునకు పూనుకొ నెను,
రామరాయలు - భాషాపోషణ : రామరాయలు పరాక్రమవంతుడు, రాజతంత్రజ్ఞుడు, ధర్మతత్పరుడు, విష్ణుభ క్తి యుతుడు. అతడు అనేక దేవాలయములను కట్టించి పోషించెను. అగ్రహారము లొసగి వేద వేదాంగవిదులైన బ్రాహ్మణులను గౌరవించెను. అతనిలో మతసహనము మూ ర్తీభవించెను.
రామరాయలు సంస్కృతాంధ్రములందు పండితుడు. సంస్కృతాంధ్రకవులను పోషించెను. మాధ్వమత బోధకులై న విజయేంద్రస్వాములవారు రాయలవలన అగ్రహారములను బడ సెను. అహోబిల మఠాధీశు అయిన షష్ఠ పరాంకుశులు రాయలకు కార్యకర్తలుగానుండి సిద్ధాంత మణిదీప, ప్రపత్తియోగ, నృసింహస్తవాది గ్రంథములను రచించిరి. రాయల ఆస్థానకవులలో సుప్రసిద్ధుడు రామరాజ భూషణుడు. రామరాజు ఆస్థానమునకు భూషణము వంటి వాడగుటచే అతనికి ఆపేరు వచ్చియుండును. పదకవిత్వ ప్రసిద్ధులయిన తాళ్ళపాక తిరుమలయ్యయు, అతని కుమారుడయిన తిరువెంగళ నాథయ్యయు రాయలచే ఆదరింపబడిరి.
నానా కళాపారీణుడై నను రామరాయలు సంగీతము నందు ప్రత్యేకాభిమాన- అభినివేశములు గలవాడు. అతని మంత్రియైన రామయామాత్యుడు సంస్కృతమున “స్వర మేళకళానిధి" అను సంగీతశాస్త్రగ్రంథమును రచించి, రామరాయలకు అంకితము చేసెను.
బి. యస్. యల్. హ.
ఆంగ్లభాషాసాహిత్యములు :- 1. భాష : భాష మానవుని ఆంతరంగిక జీవితముతో సన్నిహిత సంబంధము
కలది. మన భావములు, కోరికలు, అనుభవములు సమస్తమును శబ్దజాలము ద్వారా వెలిపుచ్చ కలుగుచున్నాము.
ఈ శబ్ద సముదాయముచే ఏర్పడిన భాషమీద సంపూర్ణమయిన అధికారము కలిగియుండుట మానవుని మహాశక్తులలో ఒకటి. భాషమీద అధికారము సంపాదించినపుడు ఆ భాషను సద్వినియోగపరచి మానవుని జీవితమునందలి పరమపవిత్ర సత్యసుందర విధానముల వ్యాప్తి కొరకై దాని నుపయోగించు సద్భుద్దికూడ మానవునకు ఉండవలెను. భాషను సక్రమముగా నియమబద్ధముగా వాడుట నేర్చినపుడే భావమునందుగూడ స్పష్టత, సరళత,సార్థకత ఏర్పడగలవు. భావములను సుస్పష్టముగా విశదపరచుటకై ఉపయోగ పడుటయే భాషకు సార్థక్యము.
భాష సజీవమయిన వస్తువు. మానవుల జీవితము మనస్తత్వము మారుచు పెరుగుచుండుకొలది భాషకూడ మారు చుండును, పెరుగుచుండును. భాషకును, భావమునకును యిట్టి విడదీయరాని అన్యోన్య సంబంధము కలదు.
ఆంగ్లభాష ఆర్యభాషా కుటుంబమునకు చెందినది. ప్రథమమున వేరువేరు భాషలు ప్రచారమునం దుండెను.వెస్సెక్సు ప్రాంతీయభాష కొంత కాలమునకు ప్రాధాన్యము కాంచెను. డేన్సు అనువారు ఇంగ్లాండుపై దాడిచేసిన కారణముచే ఏర్పడినవారి సంపర్కముచేత నూతన శబ్దజాలము ఆంగ్లభాషలోనికి వచ్చిపడెను. నార్మనులు ఇంగ్లాండును జయించిన తరువాత ఇంగ్లీషు భాష యొక్క ప్రాధాన్యము తగ్గుటయు, నార్మను భాష ప్రచారములోనికి వచ్చుటయు తటస్థించెను. 1204 వ సంవత్సరములో ఇంగ్లాండుకును, నార్మండికిని సంబంధము తెగినతరువాత నార్మనుభాషకు ప్రాధాన్యముతగ్గి ఇంగ్లీషు మరల ప్రధానస్థాన మాక్రమించుకొనెను. 1349వ సంవత్సరమున అన్ని పాఠశాలలలోను నార్మనుభాష అంతరించి ఇంగ్లీషు వాడుకలోనికి వచ్చెను. 1362 లో న్యాయస్థానముల యందు నార్మనుభాష వాడరాదనియు ఇంగ్లీషు భాషనే