Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అస్సామీ భాషా సాహిత్యములు


గోచరించును. కమలా కాంత భట్టాచార్యుని అపరిణతము అయిన పద్య కావ్యముల యందును, ప్రౌఢములయిన వచన కావ్యములయందును, దేశభ క్తియు, బుద్ధి వైభవమును ముఖ్య గుణములుగా భాసిల్లెను. పద్మనాథ గోహై బారువా అను ప్రఖ్యాతకవి చరిత్రాత్మకములైన నాటకములను, నవలలను సృజించుటయందు విజయము గాంచెను. కవితావిశారదుడగు నతడు స్వీయ విషయములను కథాత్మక కావ్యములుగ వర్ణించెను. పిదప నతడు తన జీవిత శేషమును మత విషయక గ్రంథములను నిష్ఠతో వ్రాయుటకు వినియోగించెను. మరియు నీతడు వచన రచనయం దొక ప్రత్యేకతను గడించెను. లంబోదరవరా, సత్యనాధవరా అనువారిరువురును వచన రచనయందు వైశిష్ట్యమును సంపాదించినవారే, వారిలో సత్యనాధవరా తన రచనలలో కొన్నింటికి బేకన్ కవి వ్యాసములను ఒరవడిగా గ్రహించెను, రజనీకాంత – వరద లై అనునాతడు చరిత్రాత్మకములును కల్పనాత్మకములైన తన నవలలయందు స్కాటు కవిని బంకించంద్ర ఛటోపాధ్యాయుని మించుటకై యత్నించెను. హితేశ్వర్ బర్ బారువా అనునతడు కథా కావ్య రచనయందు వాసి గాంచినాడు. దుర్గేశ్వరశర్మ సహజమును కావ్యోచితమునైన భాష నుపయోగించుట యందు విశిష్టతను గన్నవాడు.

ఇరువదియవ శతాబ్దియందలి రచయితలు ముఖ్యముగా 'జోనాకీ' (అను సంచిక) యొక్క ఆదర్శములను అనుసరింప యత్నించిరి. వాహి (Bahi) అను పేరుగల బజ్ వరువా యొక్క మాస సంచిక వాఙ్మయరంగమున క్రొత్త రచయితలను ప్రవేశ పెట్టుటకును, వారిని సరిదిద్దుటకును ముఖ్యసాధన మయ్యెను. రఘునాథ చౌధురీ అను కవి పక్షులను గురించి వ్రాసిన కావ్యములు అసాధారణ కళాకౌశల్యమున పరాకాష్ఠ నొందెను. వాటియం దాతడు ప్రకృత్యారాధనమును సంకీర్తించెను. అంబికాగిరి, రే, చౌధురి రచించిన కావ్యములయందు గూఢ ప్రేమతత్త్వము, జీవితము యొక్క దుర్దాంతమైన శక్తి సంపద, ఉత్కటమైన దేశభక్తి, వాటి దశాంతరములు అను లక్షణములు లక్షితములయ్యెను. జితీంద్ర నాథుదువరా అను కవి రమ్యము అయిన గేయములను రచించెను. వాటియందు నిరంతర శోక భావ మొకటి వ్యాప్తమై కన్పడును. అతడు భిన్న దేశములలో భిన్న కాలములలో ప్రవర్తిల్లిన కవితారచనలయందలి అందచందములను తనలో జీర్ణించుకొని వాటిని విన్యాస విశేషములచే నవ్యములుగా చిత్రింపగల్గిన సునిశిత బుద్ధి వైభవముకల కవివర్యుడు. ఇతని 'ఓమర్ తీర్థ ' అను గ్రంథము ఉమర్ ఖయ్యామునకు వివరణాత్మకమైన అనువాదము. సూర్యకుమారభూయా, రత్న కాంతవర కాకతీ, లక్ష్మీనాథఫుకను, తైలధవరాజ్ ఖొవా, నళినీబాలా దేవి అను కవుల గేయములు రూపమునందును, విషయమందును ప్రత్యేక గుణవిశేషములు కలవి. డింబేశ్వర నియోగ్, బినందచంద్రబారువా, అతుల్ చంద్ర హాజరికా, దైవచంద్ర తాలూక్ దార్ అను నుత్తమకవుల బృందము 1920 ప్రాంతమున వెలసెను. 1930 వ సంవత్సర ప్రాంతమున వెలసిన కవులలో నెల్ల దేవకాంత బారువా అనునాతడు అత్యుత్తముడు. ఆతని ప్రణయ కావ్యములందు నూతనమైన మీమాంస, విషయ నవ్యత గోచరించును. గణేశచంద్ర గోగోయి ప్రణీతములయిన ప్రేమగీతములలో హృదయమార్దవము, దుఃఖాత్మత ప్రవ్యక్తము లగును. విస్తరఖీతిచేత ఈ యుగమునకు చెందిన ఇతరకవులలో, చంద్రధర బారువా, పద్మధర చలిహా, నీలమణిపుకను, ఉమేశచంద్ర చౌధురీ, కమలేశ్వర చలిహా అను కవుల పేళ్ళు మాత్రమే పేర్కొనబడినవి.

నాటక క్షేత్రమునందు అతులచంద్ర హాజరికా అను కవి బహుగ్రంథకర్తయై విలసిల్లెను. జ్యోతిప్రసాద అగర్వాలా అనుకవి పౌరాణికమైన శోణితకుంవరీ, అను నాటకమును, చారిత్రకము. సాంఘికముకూడ నగు 'కారేంగర్ లిగిరి' అను నాటకమును రచించెను. అవి లక్షణమునందును కళాశిల్ప విషయకముగాను, పరాకాష్ఠ నొందిన నాటకములు, మిత్రదేవ మహాంత, ఇంద్రేశ్వర్ బర్ ఠాకూరు, నకులచంద్ర భూయా ప్రసన్నలాల్ చౌధురీ అను నాటక రచయితలును, తదితరులును అస్సాము నందలి కళాభిమానయుతములైన (Amateur) నాటకశాలల యొక్క ఉపయోగార్ధమై విరివిగా నాటకరచనను సాగించిరి. అస్సామీ నవలారచన ఎక్కుడు ఫలప్రదమైనది కాలేదు. దండివాధ కవితా, దైవచంద్ర