Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అశోకుడు
రాజప్రతినిధులను ఏ ర్పాటు చేసెను. తక్షశిల, ఉజ్జయిని, తోసాలి, సువర్ణగిరి అను ఈ నాలుగు పరగణాలును సరిహద్దు రాష్ట్రములుగా పేర్కొనబడినట్లు కళింగ శాసనముల మూలమున తెలియుచున్నది.
ఆశోకుని మతము: అశోకుడు కళింగ యుద్ధానంతరము బౌద్ధమతము నవలంబించె నని తెలియుచున్నది.అతడు ఒక శాసనములో తాను బౌద్ధశాక్యుడ నని చెప్పుకొని యున్నాడు. అంతేకాక క్రీ. పూ. 258 వ. సంవత్సరమున బౌద్ధధర్మముల నన్నింటిని సదుద్దేశముతో విమర్శించుటకు మొగలిపుత్ర టిస్సా యొక్క అధ్యక్షతలో మూడవ బౌద్ధ సమావేశమును ఏర్పాటు చేసెను. బౌద్ధులకు పవిత్రస్థలములైన బుద్ధగయ, లుంబినీవనము, కపిలవస్తు, సారనాథ్, శ్రావస్తి, కుశీనగరము మొదలగు స్థలములకు యాత్ర వెళ్లెను. బౌద్ధధర్మవ్యాప్తికై ధర్మమహా మాత్రులను నియమించెను. జంతువులను బలియిచ్చుట మొదలగు అలవాటులను మాన్పించెను. బౌద్దులకు ముఖ్యమైన దినములను ఉత్సవదినములుగా పరిగణించెను. ఇట్టి ప్రమాణములవలన అశోకుడు బౌద్ధమతాభిమాని యని ఘంటాపథముగా చెప్పవచ్చును.
అశోకుడు బౌద్ధమతాభిమాని అయినను, పరమతముల యెడ ద్వేషభావము లేనివాడై అన్నిటిని సమభావముతో చూచెను. ఈ విధముగ అశోకుడు ధర్మ సంస్థాపనార్థము తన సర్వస్వము త్యాగము చేసి విజయముగాంచి ప్రపంచచరిత్రలో అద్వితీయ స్థానమును పొందెను.
అశోకుడు - ధర్మము: అశోకుడు బోధించిన ధర్మము ఆచరణ సౌలభ్యము కలదనియు, సర్వజన సమ్మతమైన దనియు చెప్పవచ్చును. తల్లిదండ్రులయందు భక్ తికలిగి యుండుట, పెద్దలను గౌరవించుట, బ్రాహ్మణుల యెడ, శ్రమణులయెడ మర్యాదగా ప్రవర్తించుట, దాసులను దయతోచూచుట, అహింస, సత్యము, శౌచము, దానము దయ, మార్దవము, సాధుత, సంయమనము, భావశుద్ధి, కృతజ్ఞత, దృఢభక్తి, ధర్మరతి మొదలగు అంశములతో కూడిన ధర్మమును అశోకుడు ప్రజలకు బోధించెను. అశో కుడు తాను నమ్మిన ఈ ధర్మములను దేశములోను, దేశాంతరములోను ఉన్న ప్రజానీకమునకు అంద జేయుటకు అనేక మార్గములను, పద్ధతులను అనుసరించెను.
  1. ప్రప్రథమముగా అశోకుడు తాను నమ్మిన ఆదర్శముల లక్ష్యములను స్వయముగా ఆచరణలో పెట్టెను.రాజులకు ప్రీతికరముగు మృగయావినోదములకు స్వస్తిచెప్పెను. వేటకు మారుగా రాజ్యములోని ప్రజల క్షేమమరియుట, పవిత్రస్థలములను, జనులను సందర్శించుట ధర్మబోధచేయుట, దేశయాత్ర చేయుట, మొదలగు పనులలో కాలము గడపెను. మాంసభక్షణమును మానివేసెను. ఈ ఆదర్శములతోనే అశోకుడు మనుష్యులకు, జంతువులకు వైద్యశాలలు కట్టించేను. ప్రయాణించు వారికి సౌకర్యార్థము బాటలను వేయించెను. దారికి ఇరుప్రక్కల చెట్లు నాటించి బావులను త్రవ్వించి చలి పందిళ్ళను వేయించెను.
  2. అశోకుడు తన సామంతులు తమ తీరిక వేళలయందు ప్రజలకు ధర్మోపదేశము గావించుచుండవలెనని శాసించుటయేగాక తన ధర్మమును ప్రజలకు సులభముగ అందజేయుటకు ధర్మమహామాత్రులను నియమించెను.
  3. అశోకుడు తన ధర్మము జగమందంతటను వ్యాపింపజేయుటకై బౌద్ధ ధర్మోపదేశములను కాశ్మీరము, గాంధారము, యవనము, హిమాలయ ప్రదేశము, బర్మా,సింహళము మొదలగు దేశములకు పంపెను. ఈ సందర్భములోనే అశోకుని కుమారుడైన మహేంద్రుడు, కుమార్తె అయిన సంఘమిత్ర సింహళమునకు వెళ్ళినట్లు తెలియుచున్నది.
  4. అశోకుడు ధర్మాభివృద్ధికై ధర్మశాసనములను చెక్కించి దేశములోని ముఖ్యమయిన ప్రదేశములలోను, సరిహద్దులందును ప్రతిష్ఠించెను. ఈశాసనములు ప్రాకృత భాషలో కొన్ని, ఖరోష్ఠిలిపిలో కొన్ని, మిగిలినవి బ్రాహ్మీ లిపిలోను వ్రాయబడి యున్నవి. అశోకుని శాసనములను ఎనిమిదివిధములుగా విభజింపవచ్చును. పదునాలుగు శిలాశాసనములు, రెండు కళింగశాసనములు, మూడు గుహాశాసనములు, రెండు టిరాయి స్తంభ శాసనములు, ఏడు స్తంభశాసనములు, పరిశిష్ట స్తంభ శాసనములు, లఘుశిలాశాసనములు, భాభ్రాశాసనములు అనునవి.

ఆ.వై.

388