Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్బెరూని


అల్బెరూనికి హిందువుల విద్యలయందు ఎక్కువ ఆసక్తి ఉండెడిది. భారత దేశములో అడుగిడుటకు పూర్వమే జర్జన్ వద్ద ఇతడు తన మొదటి గ్రంథాలలో నెంచదగిన “తూర్పు దేశముల కాలనిర్ణయము" అను గ్రంథమును సంకలిత మొనర్చెను. హిందువులు కాలమును నిర్ణయించు రీతి, వారి అధికమాసగణనా రీతులు, చంద్రుని స్థానములు, జ్యోతిషము మొదలగు వాటిని గురించి, ఈ గ్రంథమునందు సమృద్ధిగా విజ్ఞానము లభించును. మొత్తము మీద పురాతన కాలమునందలి అన్ని దేశములవారును, కాలనిర్ణయము చేయుటలో అవలంబించిన అన్ని పద్ధతుల గురించియు సమాచారము ఈ గ్రంథమునందు కలదనుట నిక్కము. ఐనను ఇతడు సేకరించి, అచ్చటచ్చట ఇతర దేశీయ సంస్కృతులతో పోల్చుచు. భారతదేశమునుగూర్చి వ్రాసిన నూతన విశేషము లన్నియు ఈ గ్రంథనామము సూచించు నట్లు, ఇందు కలవు. ప్రాచీనమయిన భారతీయ వేదాంతమునుగురించి ఇతడు చేసిన వర్ణనలు అసమానములు. సంస్కృత సాహిత్యము, నాటి భారతీయులు ఆచార సంప్రదాయముయొక్క భౌతిక స్వరూపము, మొదలగు విషయములను గురించి ఇతడు రచించిన అధ్యాయములు అపూర్వములు. ఇతని వాదములు, ప్రతిపాదనలు, విషయ ప్రధానములు. తాను వర్ణింప దలచిన ప్రజల యొక్క మానసిక ప్రవృత్తులను అనేకోదాహరణములతో ఇతడు విశదీకరించును. సంకోచము, పక్షపాతము లేకుండ, హిందువుల సంస్కృతి ఇతడు చిత్రించెను. సాధారణముగా గ్రంథమునందు ప్రతి అధ్యాయములో మూడుభాగములు కలవు. మొదటి భాగము అధ్యాయము నందలి ముఖ్యాశయమును ప్రతిపాదించును. రెండవభాగమున (అధ్యాయమున గల) విషయము పై గల సిద్దాంతములు, ఆ విషయమునందలి వివిధాంశములపై ప్రాచీన హిందూగ్రంథములనుండి ఉద్ధృతములైన వాక్యములు ఉండును. మూడవభాగమునందు, భారతీయ సిద్ధాంతములను, గ్రీకులు, పారశీకులు మొదలగు ఇతర ప్రాచీన దేశీయుల సిద్ధాంతములతో పోల్చి ఇతడు పరిశీలించును. ఇతని గ్రంథములందు విషయసంపత్తి కలదు. భాషయందు అసమగ్రత, పునరుక్తులు ఉండవు. విషయ ప్రతిపాదనము నిపుణముగా నుండును. పైనచెప్పిన విధముగ "కితాబుల్-హింద్ " ఒక్కటే ఇతడు భారతదేశమును గురించి వ్రాసిన గ్రంథము కాదు. ఇతడీ దేశమును గురించి వ్రాసిన గ్రంథములు ఇరువదివరకు కలవు. వీటిలో కొన్ని సంస్కృతానువాదములు. మరికొన్ని గ్రంథములు ఆద్యములయిన సంకలనములు, వాటికి ఉత్తమమును, విశ్వాస్యమునయిన ఉపాదేయసామగ్రి (data) ఆధారము.

మహమ్మదు కొడుకయిన సుల్తాన్ మసూద్ పోషణలో 1030 వ సం. న అల్బెరూని రచించిన “కానూన్ మాస్ ఉది" అను ప్రఖ్యాత గ్రంథమే ఇతడు వ్రాసిన వాటిలో నెల్ల ఉద్గ్రంథమని చెప్పవచ్చును. తండ్రివలెనే ఇతడు విద్యాపోషకుడు. ఈ ఉద్గ్రంథమును అల్బెరూని మసూద్ నకు అంకితము చేసెను. ప్రకృతి శాస్త్రములకు సంబంధించిన పుస్తకము లెన్నియో అప్పటికే అతడు ప్రచురించియుండెను. ఈ విశాలమయిన ఉప భూఖండమంతయును ఒకప్పుడు నీటియందుండెనని కూడ అతడు ఊహించెను. గ్రీకుల యొక్కయు, భారతీయుల యొక్కయు ఖగోళశాస్త్రములందు అనంతములైన పరిశోధనములు కూడ ఇతడు జరిపెను. మసూద్, "గజినవీ సింహాసనమును అధిష్ఠింపగా, తన ఖగోళశాస్త్ర విజ్ఞానమును సమీకరించి క్రొత్త సిద్ధాంతములు చేయుటకు అనువయిన కాలము ఆసన్నమయ్యెనని అల్బెరూని భావించెను. మొత్తము పుస్తకములో నాలుగు సంపుటము లున్నవి. ఇందు ఖగోళ- వైజ్ఞానిక శాస్త్రములకు సంబంధించిన గూఢ వివరములు కలవు. ఇది అముద్రితముగా నుండుట, కొంతవరకు మాత్రమే అనువదింపబడుట, దురదృష్టము. ఇప్పుడయినను ఇది ముద్రింపబడినచో చాల సముచితముగా నుండును. మొత్తముమీద ఈ “కానూన్” అను గ్రంథము, త్రికోణ మితిశాస్త్రము, భౌతిక భూగోళ శాస్త్రము, ఖగోళశాస్త్రము మొదలగు శాస్త్రములందలి విషయములను ప్రతిపాదించునదై, అల్బెరూని కాలము నాటి వివిధ విషయములను గురించిన విజ్ఞానమునకు అధిక్యమును చేకూర్చుచున్నది. తన ఈ గొప్ప గ్రంథారంభమున ఇతడు ఈ విధముగ వ్రాసెను. శాస్త్ర విషయమున నయినను ప్రతివ్యక్తియు నెరవేర్పవలసిన కర్తవ్యమును నేనును నెరవేర్చితిని, పూర్వులు అందిచ్చిన ఆద్య