అరవిందుడు
అపుడు పూర్వమునందుకంటెను గురుతరమయిన అనర్థ మేర్పడవచ్చును" అని అరవిందుడు వాదించెను. సామరస్య సంపాదనమునందుగూడ అరవిందుడు వెనుదీసి యుండలేదు. కాంగ్రెసునందలి రెండు పక్షములను మరల ఒకే సామాన్య నాయకత్వము క్రిందికి దెచ్చుటకు ఆతడు సర్వశక్తులను వినియోగించుటకు సంసిద్ధుడై యుండెను. గ్రామ సమితుల నేర్పరచి స్వరాజ్య సిద్ధాంతమును వాటి ద్వారమున దేశమున వ్యాపింపజేయుటయందుగల ప్రాముఖ్యమును ఆతడు గ్రహించెను. "స్వరాజ్యసాధన మందు మనము గ్రామమును పునాదిగా జేయవలెను.'గ్రామమును నిర్లక్ష్యము చేయుట' అను పాత పొరపాటును మనము తిరిగి పడకూడదు. గ్రామమును మనము పరిసరభాగముల జీవనముతో అనుబంధింపచేయవలెను. ఐకమత్యము స్వరాజ్యసౌధ నిర్మితికి మూలము" శ్రీ అరవిందుడు నొక్కి వక్కాణించెను.
సంఘటన లిప్పుడు పూర్వ నిర్ణిత సిద్ధాంతములకు అనుగుణముగా శీఘ్రముగా చలింపనారంభించెను. రాజద్రోహము హద్దుమించి చెలరేగ నారంభించెను. దీనితో అధికారులు, భయభ్రాంతులై 1908 మే, 5 వ తేది ఉదయము 5 గం. లకు శ్రీ అరవిందుని బంధించి మిత్రవర్గముతో ఆతని ఆలిపూరునకు పంపి అక్కడ నున్న చెరసాలలో నుంచిరి. సుప్రసిద్ధుడును, క్రిమినల్ న్యాయవాదియునగు స్వర్గీయ ఎర్ డ్లీ నార్టన్ ప్రభుత్వపక్షపు న్యాయవాదిగా నియమింపబడెను. జిల్లా మేజిస్ట్రేటు స్థానములో పనిచేయుచున్న బర్లీ నేరారోపణములను ధ్రువపరచి, సెషన్సుకు శ్రీ అరవిందుని, తదితరులను విచారణకై పంపించెను. సెషన్సు న్యాయాధికారియగు బీచ్ క్రాఫ్టు నెదుట విచారణ జరిగెను. “దేశ బంధు" అని తరువాత సుప్రసిద్ధినొందిన చిత్తరంజన్ దాసు అరవిందునికి కారాగార విముక్తి సంపాదనమున మిగుల తోడ్పడెను. అలిపూరు కారాగారమున గడచిన సంవత్సర పరిమిత కాలము శ్రీ అరవిందుని జీవితము నందు మిక్కిలి ప్రధానమైనది. ఇచట అతని జీవితము అంతర్ముఖమై అనంతరీతుల ఆధ్యాత్మిక జీవితము యొక్క సంపూర్ణ వికాసమునకు దోహద మొసగినది. ఇచ్చట వీరికి లభించిన దివ్యానుభవములు వీరి భవిష్యజ్జీవిత మార్గమును నిర్ణయించినవి. ఈతడు వీటిని "కర్మ యోగి” పత్రిక ద్వారమున లోకమునకు అందిచ్చెను.
ఆధ్యాత్మిక జీవితము : ప్రభుత్వము అరవిందు నేదోవ్యాజమును పురస్కరించుకొని నిర్బంధింపవలయునని పట్టుపట్టి యుండుట స్పష్టమైనప్పటి నుండియు అతడు ఎచటనో అజ్ఞాత వాసమునందుండియే తన కార్యములను నిర్వహించుచుండెను. కడకు ఒకటి రెండు మాసములు చంద్రనగరునం దుండి, 1910 ఏప్రిల్ 4వ తేదినాడు అతడు పుదుచ్చేరి యందు ప్రవేశించెను. ఇచటనే నిర్యాణ పర్యంతము అతడు తన యోగసాధనమునుకొనసాగించెను.
పుదుచ్చేరిలో శ్రీ అరవిందుడు గడిపిన కాలమందు బాహ్య ఘటనలుగా లోకమునకు తెలుపదగిన అంశములు మిక్కిలి స్వల్ప సంఖ్యాకములు. 1914 వ సంవత్సరమున ప్రారంభింపబడిన 'ఆర్య' అను మాసపత్రిక ద్వారమున అరవిందుడు తన తత్త్వదర్శన యోగమార్గములను గూర్చి లోకమున కెరిగించెను.
శ్రీ అరవిందుల తత్త్వ దర్శనము ప్రాచీన కాలము నుండియు మనకు సంక్రమించిన ఆధ్యాత్మిక సత్యములపై ఆధారపడి యున్నది. అరవిందుని తత్త్వదర్శన మిది : ఈ సకలసృష్టికిని కారణమైన మూలతత్త్వ మొక్కటియే. ఏకం సత్ - దీనిని సచ్చిదానందమని వర్ణింపవచ్చును. ఇదియే అద్వితీయమైన చైతన్యము లేక బ్రహ్మము. అనంతప్రకారమై సతత పరిణామములకు లోనై, కొంత జడమై, కొంత సప్రాణమై, అజ్ఞానము, శోకము, మోహము మున్నగు అశుభములకు క్షేత్రమై తోచు ఈ సర్వమును, అద్వైతమును, నిత్యము, అనంతమును ఐన చైతన్యమే. 'బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం'. ఇంత అనుభవ విరుద్ధమైన మాట యొక్క సత్యమును గ్రహించుట, చేరుట, మానవుని చేతన ద్వారముననే జరుగవలయును. (ఏషో౽ ణురాత్మా చేతసా వేదితవ్యః). మానవుడు తన ఉనికి యొక్క సత్యమును తాను గ్రహించినయెడల అనగా, తన యాత్మను తాను గ్రహించిన యెడల ఒక యద్భుత మతనికి యథార్థమై గోచరించు చున్నది. తన యందలి ఈ యాత్మయే, సర్వభూతములందును గల యాత్మ ;అనగా తన ఆత్మనే సర్వభూతముల యందును అతడు చూచుచున్నాడు. అట్లే సర్వభూతములను తన ఆత్మ