Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమరావతి


అమరావతియను పేరులు పూర్వము ఒక్క నగరమునకే వర్తించియున్నను, నేడు ఆ నగరమున్న పశ్చిమభాగమునకు ధరణికోట యనియు, స్తూపమున్న భాగమునకు అమరావతి యనియు పేరులు స్థిరమై ఆ పూర్వపు పట్టణము ఇప్పుడు రెండు వేరువేరు గ్రామములుగా విడిపోయినది.

రెండు వేల ఏండ్లకు పూర్వము నిర్మింపబడిన బౌద్ధస్తూప రాజమును బట్టి ఈ పురమునకు లోకవిఖ్యాతి కలిగినది. భారతీయ బౌద్ధకళాచరిత్రమున అమరావతి చరిత్రము ఒక గొప్ప ప్రకరణముగ నున్నది. బౌద్ధయుగమునాటి ఆంధ్ర శిల్పులు భ క్తితత్పరులై బుద్ధభగవానుని దివ్యస్మృతికి కానుక పెట్టిన శిల్ప నీరాజనము అమరావతీ స్తూపము. సంప్రదాయమునుబట్టి 'స్తూప' శబ్దము బౌద్ధ నిర్మాణమునకే వర్తించును. బౌద్ధ వాఙ్మయమునందును, అమరావతి శాసనములందును “స్తూప పదము కనిపించదు. దానికిబదులుగ 'చైత్య' మను పదమే వ్యవహారమునందుండెను. చితాశబ్దభవమే ఈ చైత్యము. బౌద్ధ కళాస్తూపముల ఉత్పత్తులను గూర్చి “మహాపరినిబ్బానీసుత్తము"నందు ప్రధానములగు రెండు విషయములు గోచరించును. బుద్ధుల యొక్కయు, ప్రత్యేక బుద్ధుల యొక్కయు, అర్హతుల యొక్కయు, చక్రవర్తుల యొక్కయు ధాతువులు చైత్యనిర్మాణమున భద్రపరచి పూజింపవలయును. బుద్ధుని నిర్వాణమునకు పిదప ఆతడు పుట్టిన స్థలమును సంబోధి నొందిన స్థలమును, మొట్టమొదట ధర్మమును బోధించిన స్థలమును, నిర్వాణ మొందిన స్థలమును బౌద్ధులు దర్శింపవలయును అనునవి ఆ రెండువిషయములు. వీటిని బుద్ధుడే ఆనందునితో చెప్పెనట. బుద్ధుని ఆదేశానుసారముగ అతడు నిర్వాణ మొందిన వెంటనే ఆ మహనీయుని ధాతువులను ఎనిమిదిభాగములుగ చేసి ఒక్కొక్క ధాతువుపై ఒక్కొక్కటిచొప్పున ఎనిమిది చైత్యములును శిష్యులు నిర్మించిరి. వీటికి శారీరక చైత్యములని పేరు. ధాతుగర్భవదము యొక్క భ్రష్టరూపములే దాగొబ్బ, దగ్బ, దబ్బగ అనునవి. వీటినుండియే దిబ్బ అను పదము వచ్చియుండును. అశోకుడు తన రాజ్యమునందలి ప్రజల యొక్క బౌద్ధధర్మ తృష్ణను తీర్చుటకై 7 చైత్యములను త్రవ్వించి అందలి ధాతువులను ఎనుబదినాలుగు వేల శకలములుగా చేసి తన రాజ్యమునందలి వేరువేరు భాగములందు వేర్వేరు స్తూపములను వెలయించెను. మతప్రచారమునకై, 'మహిషమండలమునకు అశోకునిచేత పంపబడిన మహాదేవ భిక్షువను నాతడు అమరావతియందు బుద్ధుని ధాతువును, చైత్యగర్భితము కావించి చైత్యవాదమును స్థాపించినట్లు శాసనములవలన తెలియుచున్నది. సమ్యక్సం బుద్ధుని శారీరక ధాతువును ఇచ్చట స్థాపించుటచేతనే వేర్వేరు సంప్రదాయములకు చెందిన బౌద్ధులు ఇచట స్థావరము లేర్పరచుకొనుట తటస్థించినది. యూవాన్ చాంగ్ వ్రాసిన వ్రాతలనుబట్టియు, అమరావతి శిల్పమును బట్టియు, ధాన్యకటకము మహా బౌద్ధక్షేత్రమై యుండుటనుబట్టియు మహాయానపక్షావలం బకులకువలెనే "హీన యాన" పక్షమువారికి కూడ అమరావతి వాసస్థానముగ నుండినట్లు గోచరించును.

స్తూపము చితాసంబంధియైనను, ధాతుగర్భ సంబంధియైనను దాని ఆకృతిని గూర్చి భిన్నాభిప్రాయములు గలవు. కొందరు దాని యాకారము సగముదయించిన సూర్యబింబము యొక్క ఆకారమును పోలియున్నదనియు, మరికొందరు జీవితము బుద్బుద సదృశమను తాత్త్వికాశయమును లోకమునకు వెల్లడించుటకో యన్నట్లు స్తూపము బుద్బుదాకారముతో నిర్మించబడి యున్నదని అందురు. అనగా శరీరము బుద్బుదమువంటిది అను భావము బుద్బుదాకృతి గల స్తూప రూపమున ప్రకటితమైనది. పరమాత్మ స్తూపాంతర్గతమగు ధాతు రూపమున వ్యక్తీకరింపబడెను. ఈ స్తూపముపై ఒకటి కాని, మూడుకాని, ఛత్రము లుంచుట వాడుక— (1) దేవతలకు (2) మనుష్యులకు (3) నిర్వాణము అనగా బుద్ధ మోక్షమునకు. ఈ ఛత్ర త్రయమే బౌద్ధుల నిర్వాణ, పరినిర్వాణ, మహాపరి నిర్వాణములనుకూడ సూచించును. అండోపరిస్థితమైన హర్మిక (Pavalion) విభాగములు విశ్వ భాగములను సూచించును. ఈ విధమున స్తూపమందలి వేరువేరు భాగములు వేర్వేరు విషయములకు సంకేతములైనవి. స్తూపమంతయు గలపై మేరుపర్వతమునకు చిహ్నముగా నైనది. శాస్త్రజ్ఞులు ఇతర స్థలముల యందుకంటే అమరావతియందు స్తూపలక్షణము పరిపూర్ణత చెందిన దందురు. క్రీస్తు శకము మూడవ శతాబ్దికి