Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆబ్రహామ్ లింకన్

కాలికట్టునందు కొంత కాలము నివసించిన తరువాత విజయనగర ప్రభువు అగు రెండవ దేవరాయలకడ నుండి అబ్దుర్ రజాకునకు ఆహ్వానము వచ్చెను. అనతి కాలములో ఆతడు బయలుదేరి విజయనగరరాజ్యమును చేరెను. త్రొవయందు అతడు బేదునూరు అను ప్రదేశమునగల దేవాలయమును చూచి చాల అద్భుతపడెను. దాని అందము వర్ణనాతీతమని రజాకు వ్రాసెను. 1443 వ సంవత్సరము మార్చి నెలయందు అతడు విజయనగరమును చేరెను.

విజయనగరమును ఆకాలమున రెండవ దేవరాయలు పరిపాలించుచుండెను (1423-46). ఈరాజు అబ్దుర్ రజాకును సగౌరవముగ తన రాజధానికి కొనివచ్చుట కేర్పాట్లు కావించెను. విజయనగరమున నివసించినంత కాలమును అబ్దుర్ రజాకునకు చాల గౌరవము జరిగెను. అతనికి అనేక పర్యాయములు రాజదర్శనము లభించెను. ఆ సమయములందు దేవరాయలు పారసీక రాయబారి యగు అబ్దుర్ రజాకును మిక్కిలి ఆదరించి, అతని యేలికయగు పారసీక చక్రవర్తిని గూర్చియు, ఆ దేశపు విశేషములను గూర్చియు ప్రశ్నించెడివాడు. రాయబారి వెడలిపోవు.నప్పుడు రాజు అతనికి ఉచిత సన్మానము కావించెను. విజయనగర ప్రభువగు రాయలు ఉత్తమ రాజన్యుడనియు, అతని రాజ్యము సర్వ సౌఖ్యములకు ఆకరమనియు, ఆతని రాజధానియగు విజయనగరము ప్రపంచమందలి నగరముల కన్నిటికంటే మిన్నయనియు రజాకు తాను వ్రాసిన గ్రంథములో తెల్పియున్నాడు. విజయనగర సౌందర్యమును గూర్చి అతడు తెల్పిన అంశములు ఇతర విదేశ యాత్రికులు తెల్పిన విషయములతో ఏకీభవించుచు, ఆనాటి విద్యానగర సామ్రాజ్య శోభను మనకు కండ్లకు కట్టినట్లు చూపుచున్నవి. విజయనగర చరిత్ర రచనకు అబ్దుర్ రజాకువంటి వారి వ్రాతలు చక్కని సాధనములు.

ఖం. డా. శే.

అబ్రహాము లింకన్  :- అమెరికా సంయక్త రాష్ట్రముల 16 వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రఖ్యాతులైన ప్రపంచ రాజకీయ వేత్తలలో ఒకడు. ఆతనియందు మహా పురుషుల కుండవలసిన ముఖ్య లక్షణములగు ధైర్యము, మేధ ప్రబలముగ ఉండెడివి. చక్కని సౌహార్ధ్రమునకు లక్షణము లగు, దయ, దాక్షిణ్యము, ఓర్పు, సానుభూతి అతనిలో మూర్తీభవించి ఉండెడివి. అతనికి కేవలము భౌతిక ధైర్యమేకాక అపారమగు నైతిక ధైర్యముకూడ కలదు. ఈ సద్గుణములు ఆతనిని అమెరికా ప్రజలందరికి ఆరాధ్య దైవముగ పరిణమింప చేసినవి.

అల్పసంఖ్యాకులైన ప్రజలుగల కెంటుకి రాష్ట్రములో జనసమ్మర్దములేని మారుమూలనున్న ఒక కొయ్య ఇంట్లో (log cabin) లింకను క్రీ.శ. 1809 సం. ఫిబ్రవరి 12 వ తారీఖున జన్మించెను. అతని తండ్రి థామస్ లింకను. అతడు నిరక్షరాస్యుడు. అతడు పురోగమనాభిలాష లేని ఒక సామాన్యుడు. అతని సంపాదనతో కుటుంబము యొక్క భుక్తిమాత్రము ఏదో విధముగా గడిచిపోయేడిది. లింకనుతల్లి నాన్సీ హేంక్స లింకను మంచి నమ్రతయు మతములో చాల అభిరతియు కలిగిన వ్యక్తి. అబ్రహాము మీద ఆమె ప్రభావము చాల విశేషముగ ఉండేడిది. అబ్రహాము తన అభివృద్ధి కంతటికిని తన తల్లియే కారణభూతురాలని సగర్వముగా చెప్పుకొనెడివాడు.

లింకను తొమ్మిది సంవత్సరములు పాఠశాలకు పోయి చదివినప్పటికిని, ఒక్క పట్టున వరుసగ ఏడాది కాలమైనను చదివినట్లు కనపడదు. అయినను అతడు స్వయముగానే విద్యను అభ్యసించెను. అతనికి పలక బలపము మొదలయిన సాధనములు దొరకకపోవుటవలన ఒక బొగ్గు ముక్కతో కఱ్ఱపలక మీద వ్రాసికొనెడి వాడట! అందువలననే కాబోలు అతనికి పుస్తకములమీద చాల ప్రేమ ఉండెడిది. తండ్రికి పనిపాటలలో సహాయపడుచు కొంచెము అవకాశము చిక్కించుకొని అతడు దొరకినపుస్తకములనన్నిటిని చదివెడి వాడు. ఈ పుస్తకములను సంపాదించుటకు అతడు చాల. దూరము నడిచిపోవలసి వచ్చెడిది. ఈ విధముగ తన ఇంటికి చుట్టుప్రక్కల 50 మైళ్ళ దూరములో లభింపగల ప్రతి పుస్తకమును అతడు చదివెను.

ఒకసారి క్రీ. శ. 1829 వ సం. లో న్యూ ఆర్లియన్సు పోవుచు నీగ్రో బానిసలను కొయ్యలకు గొలుసులతో బంధించి పశువులను అమ్మినట్లు అమ్ముట అబ్రహాము చూచెను, దీనితో అతని మనసు కరగిపోయి సాధ్యమైనంత త్వరలో నీగ్రోల బానిసత్వమును నిర్మూలింపవలెనని అతడు