Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అజంతా


సాటిలేని వై యున్నవి. చావడిలో వెనుక వరుసలోని అతి రమణీయమగు అలంకరణములుగల రెండు మధ్యస్తంభముల అడుగుభాగమును నాలుగు తలలతో మోయు సింహముల యెనిమిది బొమ్మలు చెప్పతగిన వైయున్నవి. ఈ సింహములు ఒక దాని వెన్నును మరియొకటి ఆనుకొని కూర్చున్నట్లు చెక్కబడినవి. ఈ గుహలోని గర్భాలయ ద్వారము, దానిమీద అనేక భాగములలో తొలువబడిన పుష్పసంబంధమగు విపుల చిత్రములతోను, బుద్ధ విగ్రహములతోను,ద్వారపాలికలతోను, వలయాలంకారములతోను, త్రాటి మెలికలతోను, కుడ్య స్తంభములతోను, పద్మ దళములతోను, ఆశ్చర్యజనకముగా నుండును. మూలలందలి చూరులమీది మకరములపై నిలిచియున్న స్త్రీ ప్రతిమలు, ముందుగదిలోని స్తంభములు, కుడ్యస్తంభముల మీది అలంకరణములు కూడ విశేషముగా మనోరంజకములై యుండును.

సంగ్రహముగా చెప్పదలచినచో, ఊహాతీతమైన అల్లిక పనితనమునకును, శిల్పగతమైన వాస్తువిన్యాసములకును, అజంతా ఒక గొప్ప చిత్రప్రదర్శనశాల యని నుడువ వచ్చును, ప్రాచీనమైన భారత దేశపు . ఏ కళా క్షేత్రమునకు గాని పురాభవనమునకుగాని యిది తీసిపోదు. వాస్తు నిర్మాతలైన యీ ప్రాచీన కళావిదుల శక్తిని గూర్చియు, వారికిగల ఓషధీపరిజ్ఞానమునుగూర్చియు గ్రిఫిత్సు చెప్పినది అతిశ యోక్తి కాదు.

వర్ణచిత్రలేఖనము మాసిపోయిన అన్ని గుహలలోను ఉబ్బెత్తు చిత్రములందు కనబడు అలంకరణాత్మకమగు పని నిజముగా అత్యాకర్షణీయమై యున్నది. పౌరాణిక వృత్తాంతములను, రేఖాగణితాకృతులను, పుష్పవితానములను, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు బొమ్మలను కలిగియున్నదై యీ అలంకరణము విన్యాసములయొక్క అనంత వైవిధ్యమును చూపును. పక్షి. జంతు చిత్రములలో ముఖ్యముగా మకరముల యొక్కయు బాతుల యొక్కయు చిత్రణము శిల్పి యొక్క కల్పనా చమత్కృతి ననుసరించి అపురూపమగు అలంకరణములతో కూడి చిత్రవిచిత్రమగు ఆకారములు కలదైయున్నది. ఇచట బుద్ధుని యొక్క వ్యక్తిత్వమును సంపూర్ణముగా శిల్పమందును చిత్రమందును ప్రకటించుటకు తగిన ఆదర్శపూర్వరంగమును సృష్టించుటలో శిల్పి యొక్క అద్భుత కల్పనాశక్తియు, పరిపూర్ణ కౌశలమును తోడ్పడినవి.

జంతువులు  : అజంతాలోని బుద్ధ విగ్రహమునకు సంబంధించిన గొప్ప చెక్కడములను పరిశీలించుటకు ముందు వాటికి ఏ విధముగను తీసిపోక శిల్పిచే గైకొనబడిన మరికొన్ని యితివృత్తములనుగూర్చి సంగ్రహముగా చెప్పతగియున్నది. ఉదాహరణముగా అజంతాలో చెక్కబడిన జంతువుల బొమ్మలు వాటి అలవాట్లను, వాస్తవికత ఉట్టిపడునట్లు ప్రకటించగల సామర్థ్యమును వెల్లడించుచున్నవి. ఏనుగు, ఆ జంతువునకు స్వభావ సిద్ధమగు అనేకమైన తీరులలో చూపబడెను; అట్లే యితర జంతువుల శిల్పములు కూడ శిల్పి యొక్క సూక్ష్మ పరిశీలనను నిరూపించుచు జీవ ముట్టిపడు చున్నది. అజంతాలో అనేక స్థలములందు కనబడు లేడి, సింహము, తుదకు పొట్టేలు (రెండవ సంఖ్య గుహలో పొట్టేళ్ళ పోరాటము చిత్రితమైనది) మొదలగు జంతువులు వాటి అవయవ నిర్మాణము నిర్దుష్టముగను, కళాత్మకముగను ఉండురీతిని వాటి వాటి కుచితమగు పరిసరములలో సున్నట్లు శిల్పింపబడినవి.

ఒక స్తంభము యొక్క ఆమలకముపై ఒకే శిరస్సు కలిగిన నాలుగులేళ్ళు చెక్కబడిన ఫలకము ముఖ్యముగా పేర్కొన దగియున్నది. ఈ ఆమలక విషయమునందు శిల్పి యొక్క ప్రతిభ, నాలుగు శరీరముల నొక శిరస్సుతో కలుపుటయందలి 'కొంటెతన మందుగాక, వాటిలో ప్రతిబొమ్మ యందు నిజమగు లేడి యొక్క జీవకళలో కూడిన తీరును చూపుటయందు గలదు. క్రింది యెడమ లేడి నేలమీద కూర్చుండి అపాయమును శంకించినట్లు తలయెత్తి ముందునకు చూచుచున్నది. అదే శిరస్సు వేరొక తీరులో కుడిప్రక్కనున్న దాని సహచర మృగమునకు వెనుకతోచిన అపాయమును పసిపట్టుటకు మెడవంచి జాగరూకతతో నున్నట్టి భంగిని కల్పించుచున్నది. అదే శిరస్సుతోకూడిన పై భాగమందలి లేళ్ళజంటలో ఎడమలేడి శత్రువు యొక్క ఉపసరణమును పరికించు చున్నట్లు మెడనుక్రిందికి వంచి ముట్టెను ముందుకు చాచినట్లును, కుడిపై వుది కాలిగిట్టతో ముట్టెను గోకుకొనుటకు మెడను