xxvii
ముగా విద్యావతీదండకమును[1] చెప్పెను. కావున యాతడు 17వ శతాబ్ది ద్వితీయార్ధమం దున్నవాఁడు. వరదరాజు గ్రంథమునుండి యీతఁడు పద్యము గ్రహించుటచే వరదరాజు 17వ శతాబ్దిమధ్యనున్న వాఁడని నిశ్చితముగాఁ జెప్పవచ్చును.
రచనలు
వరదరాజు వైష్ణవమతాభిమాని. యతిరాజాచార్యుల శిష్యుఁడు.[2] శ్రీ వేంకటేశ్వరుఁ డీతని యిష్టదైవము. కావున నీతని రచనలన్నియు వేంకటేశ్వరాంకితములై యుండును - వీనిలో మొదటిది.
పరమభాగవతచరిత్ర
ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వాల్మీకి, వ్యాస, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యాయన, రుక్మాంగద, అర్జున, వసిష్ఠ, విభీషణులను పదునలుగురు పరమభాగవతుల చరిత్ర పద్యకావ్యముగా రచియింపఁబడినది. ఇది యెనిమిదియాశ్వాసముల కావ్యము. శ్రీవేంకటేశ్వరస్వామి కంకితము. గ్రంథాంతగద్య యిట్లున్నది.
“ఇదీ శ్రీమదలమేలుమంగాసనాథ తిరువేంగళనాథకటాక్షరక్షితసకలసామ్రాజ్యవైభవ కట్ట హరిదాసరాజతనూభవ సాహితీభోజ వరదరాజప్రణీతంబైన పరమభాగవతచరిత్రం బను మహాప్రబంధమునం దష్టమాశ్వాసము.”
ఈ గ్రంధము తనరచనల కన్నిటికిని మున్నైనట్లు కవి తన శ్రీరంగమాహాత్మ్యముననే యిట్లు చెప్పినాఁడు.