పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

నని నాకుఁ గొండంత కోరిక గలిగినది. ఆ విశ్వవీరుని నామధేయము కనఁబడిన గ్రంథముల నెల్లఁ దెప్పించుకొని పఠించితిని. భాగ్యవశమున ననేకామూల్యాంశములు గడింపఁగలిగితిని. వత్సరములకొలఁది నామహాభాగుని గుణగణము లూహించి, భావించి, ధ్యానించి, తన్మ యుఁడ నగుచుంటిని.

ఇతివృత్తము సంపూర్ణముగఁ జరిత్రాత్మకము. రంగము పవిత్రమయిన యార్యావర్తక్షేత్రరాజము. ప్రధాననాయకుఁ డుత్తమోత్తమ భారతీయ శిరోమణి. అయిన నుత్తర హిందూస్థానమందలి ( అహమ్మదాబాదు - అసహుల్ వారా - ఝసల్ మియర్ -చౌరా ఘర్ మున్నగు ) పురముల నామములును, (డోంగరీశుఁడు - సోనెగుఱ్ఱమహీంద్రుఁడు - మహమ్మజ్జలాలుద్దీనక్బరు - ఖాన్ ఖానన్ - హకీంహుమాం - మీర్జా అబ్దూరహిమాన్ ) లోనగు పురుషుల నామధేయములును, (మండలగృహము అంతల్లా - కుంభల్మియర్ - చేవందా - చానార్ దుర్గము - తారాఘర్ - రణస్తం భపుర దుర్గము) మొదలగు కోటల పేళ్లును శ్రుతికటువులై దీర్ఘములై ఛందోగణములలో సులభముగ నిముడనివై యున్నవి. మఱియు నిది 25 సంవత్సరము లవిచ్ఛిన్నముగ సాగిన మహాసంగ్రామము. సాధనములు శర చాపములుగావు.తుపాకులు-శతఘ్నులు. మాతృకలోఁ బదునాలుగుపుటలున్న ప్రతా పసింహరాజచంద్రుని చరిత్ర మొక్క కళ తక్కువగ వెలుఁగుచున్నది. రాజస్థానదేశచరిత్ర మనేక రాజ్యములను వీరయోధులను గుఱించి వ్రాయఁబడినది. కావునఁ బ్రతాపుని పాత్ర మును బ్రత్యేకముగను సమగ్రముగను బోషింప నవకాశము లేక పోయియుండుట సత్యము. ఆ కొఱవడిన ‘ఆధ్యాత్మికకళ'ను జేర్చి యా రాజ గురుమహాసార్వభౌముని పాత్రమునకు వన్నె చేకూర్చి నిర్వచనకావ్యముగ వెలయింప నారంభించితిని.

1982 మార్చి నెలకు మూఁడాశ్వాసములు వ్రాయఁగలిగితిని. ఆరోగ్యము చాలక కడపఁ దాఁటి కదలఁజాలని దుర్భలస్థితి నుండి గ్రంథ మంతటితోఁ గడమవడిపోవునేమో యని పలుమాఱు వగ నొందితిని. పదు నెనిమిది మాసము లంతరాయమున కోర్చి మఱల నారంభించి యొకమాసమున గ్రంథముఁ బూర్తిచేసితిని. నా పరమమనోరథఫల స్వరూప మగు ప్రతాపదేవుని దివ్య చరిత్రము నాద్యంతము రచించి నిర్వహింప ననుగ్రహించి నాకు మనఃపరితృప్తి గలుగఁ జేసిన యీశ్వరుని కరుణామయత్వమును గొనియాడితిని.

ఈ గ్రంథమున కావిష్కరణమహోత్సవముఁ దీర్చిన మిత్రులు ప్రశంసాపాత్రులు. ఆవిష్కరణ సభ “కావ్యకళానిధి” బిరుదము నొసంగి నన్ను గౌరవించినందులకై ప్రొద్దు టూరు హైస్కూలులో “కళానిధి” -బహుమానము శాశ్వతముగా నెలకొలిపిన శ్రీ రావు బహదూరు వి. వసంతరావుగారి యౌదార్యమును గణింతును.