ప్రధమాశ్వాసము
9
గీ॥ చేరి హమ్మీర గంభీర సింహ నృపులు
కాకసస్ పర్వతమునుండి కాశిదాఁక
నూటయెనమండ్ర క్షితిపుల మాటమాత్రఁ
బిలుచుకొని వచ్చి పృధ్వీశుఁ గొలుతు రెపుడు.29
మ॥ అతితేజోబలధాముఁ డా సమరసింహశ్మీతలేంద్రుండు వం
దిత నానాజనపాలలోకుఁడగు పృధ్వీభర్తకున్ సోదరీ
పతి వజ్రాయుధకోటి మ్రింగఁగల మేవాడ్దేశ రాహుత్తులున్
గృతహస్తుల్ తనుఁగొల్వ వచ్చెనని కేకీభూత చేతస్కుఁడై.30
గీ॥ భరతఖండంబు నాక్రమింపఁగఁ దలంచి
యేడుమాఱులు ఘోరిదండెత్తి వచ్చె
మఱఁదియును బావయును దాఱుమాఱు చేసి
యతని వెనుకకు నంపించి రాఱుమార్లు.31
సీ॥ త్వార్వంశ భవులైన ధరణీతలేశ్వరుల్
పూర్వ మింద్రవస్థ పురిని సార్వ
భౌములై యేలిరవ్వారిలోన 'ననంగ
పాలుండు' కడపటివాఁ డతండు
పుత్రసంతతి లేక పుత్రికలను నిర్వు
రనుగాంచె మొదటిదానిని గనూజి
బీజపాలునకును బిదపటిదాని సో
మేశున కజమీరు దేశపతికి
గీ॥ నిచ్చె,వారికి జయచంద్ర పృథ్వివిభులు
గలిగి రయ్యనంగుఁడు కొంత కాలమునకు
వ్యాధి పీడితుఁడగుచు నిజాత్మజలను
మనుమలను బిల్చుకొని చెంత నునిచికొనియె.32
గీ॥ ఒక్కనాఁడు పట్టాభిషేకోత్సవంబు
జరుప సామంత నృపుల నందఱును జేర్చి
యయ్యనంగుఁడు ఢిల్లీ సింహాసనంబు
నెక్కు మన నెక్కి కూర్చుండెఁ బృథ్వివిభుఁడు.33