పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ॥ హరితమౌనీంద్రు పాదాబ్జాత యుగళికి
             శిష్యుఁడై శుశ్రూష చేయఁ గలిగె
    వ్యాఘ్రశైలంబు తాపసు కూర్మిఁగని ద్విధా
             రా ఖడ్గమును పొంది రాణ మెఱసె
    బ్రమరుల గెలిచి భారత సూర్యుఁ'డని 'విశ్వ
             పతి ' యని బిరుదముల్ పడయఁగలిగె
    ఖాండహా రిస్పహన్ కాఫరి స్థానాది
             యవనసీమలు గెల్చి యశముఁగాంచె
             
గీ॥ వందలకుఁ బైనఁ బుత్రులఁ బడసి సూర్య
    వంశమును నిల్పి సౌపర్వ పర్వతమునఁ
    దపముఁ గావించి ముక్తి కాంతను వరించె
    బప్పరావు మేవాడ్భూప వంశకర్త.14
    

భరతఖండముపై యవనుల దండయాత్రలు



సీ॥ తమ యుపనదుల సంతతులెల్ల వెండి రే
             కులువోలె నెల్లెడ నలముకొనఁగ
    జహ్నుకన్యాసింధు సలిలపూరమ్ములు
             సారతఁగూర్ప బంగారు పండు
    రసఖండమై పచ్చరా బయలులమాడ్కి
             లలిత సస్యశ్యామ లంబునగుచుఁ
    బిడికెఁడు చోటైన వెలిఁబోవనట్టి యా
             ర్యావర్త బహుళ భాగ్యాంక కధలఁ
             
గీ॥ జెవులు చిల్లులువోఁ బారసీక యవన
   ఖాండహారిస్పహాను బాగ్దాదు మొగలు
   గజ్నిపతులు మిడుతదండు క్రమ్మినట్లు
   దాడి వెడలిరి తండోప తండములుగ.15
   
గీ॥ ఎనిమిదవ శతాబ్దారంభమునఁ గవీపు
   'వాలీదు' తొలుత ఖాసిముఁబంపె నతఁడు
    సింధుదేశమ్ము దాటి కాశీపురంబు
    వఱకుఁ గలసీమ లన్నియుఁ బాడుచేసె.16