పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

269


గరుజన్నిదంబు భుజమునఁ
గరము ప్రకాశింపఁజేసి కమలాక్షుఁ డొగిన్.

246


తే.

కనకమయ మగుసున్నపుఁగాయ వక్క
లాకులును వస్త్రమున సొబ గలరఁ గట్టి
కక్షమం దుంచి కోదండకాండములను
బరఁగఁ జేబట్టె నప్పుడు హరి ముదమున.

247

శ్రీనివాసుఁడు వేఁటాడుట

సీ.

దైవయోగంబునం దనసమీపమునకు
        నురుతరజవనాశ్వ మొకటి వచ్చి
నిలువఁగ దానిపై నీరజాక్షుం డెక్కి
        చని వనగిరులందు సంచరించి
సారంగభల్లూకచమరీశరభసింహ
        శార్దూలముఖమృగసంఘములను
వేఁటాడుచుండె నావేళ నందొకమద
        కరి చక్రి నెదిరించె గహనమందు


తే.

దాని సమయింప సమకట్టి దానివెంట
నరుగ నది పర్వతము డిగి యరిగెఁ జక్రి
తఱిమె వెంబడి యోజనార్ధంబు వోయి
చేరెఁ బద్మావతిగలశృంగారవనము.

248


తే.

చెంగటం జేరి ఘీంకృతిఁ జేయ గజముఁ
జూచి పద్మావతీదేవి చొప్పరయుచుఁ
జెట్లచాటునఁ జేరఁగఁ జెలులు నట్ల
చేరి యిట్లని పల్కిరి చిత్రపడుచు.

249