పుట:శృంగారశాకుంతలము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు శ్రీ యం. ఆర్ . అప్పారావుగారు చేసిన సూచన ననుసరించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తెలుగుభాషలోని ప్రాచీన సాహిత్యము అందరికి అందుబాటులో నుండునట్లుగా ముద్రించి ప్రకటించవలెనని నిశ్చయించినది. తెలుగుభాషలోని పూర్వగ్రంథ సముదాయము ఈనాడు పాఠకునికి సక్రమముగా సరసమైనధరకు లభ్యమగుట లేదు. ఈ లోటును తీర్చి ప్రాచీనగ్రంథసంచయమును విడివిడిగా ప్రకటించుటకు సాహిత్య అకాడమీ, ఒక ప్రణాళికను సిద్ధము చేసినది. ఈ ప్రణాళిక ప్రకారము ఈకార్యక్రమము మూడు తరగతులుగా విభజించనైనది. మొదటిది ప్రాచీన ప్రబంధాల ప్రకటన; రెండవది మహాభారతము, భాగవతము, హరివంశము, భాస్కరరామాయణము, బసవపురాణము, భోజరాజియములను సంగ్రహించి ప్రకటించుట; మూడవది భారతభాగవతాలనుండియు, నాచన సోమన, కంకంటి పాపరాజు, కూచిమంచి తిమ్మకవి రచనలనుండియు భాగాలను ఏర్చి కూర్చి ప్రకటించుట. మొదటి తరగతిలో 27 ప్రబంధాలను 27 సంపుటాలుగా, రెండవ తరగతిలోని గ్రంథములను 15 సంపుటాలుగా, మూడవ తరగతిలోని గ్రంథాలను 8 సంపుటాలుగా మొత్తము 50 సంపుటాలను ప్రకటించు కార్యక్రమము స్వీకరించవలెనని అకాడమీ తీర్మానించినది.

ఈ ప్రణాళిక ప్రకారము ప్రతి సంపుటము 1/8 డెమ్మీ సైజులో క్యాలికో బైండుతో 200 పేజీల గ్రంథముగా నుండవలెనని నిర్ణయించనై నది. ప్రతిగ్రంథములో గ్రంథకర్తనుగూర్చి, గ్రంథ