పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 85

ఏడవరాత్రి:

చ. అల యలినీలవేణి విరహాతురయై మఱునాఁటి రాత్రి రా
చిలుకపటాణి నెక్కెడి వజీరునిఁ బోలిన యా నృపాలునిం
గలయఁ దలంచి మేన నయగారము గీర్కొనఁ జేసి చేరె ని
ర్మలగుణశాలియైన శుకమండలమౌళిసమీపభూమికిన్. 343

తే. అప్పుడా రాజకీర మిట్లనుచుఁ బలికె
మగువ! మగవాని మేలు నమ్మంగఁ దగదు
మది నొకానొకయెడ రోష మొదవె నేని
నేర్పుగల దూతి యొకరీతిఁ దేర్పవలయు. 344

క. పతి నేవగించు సతికి
న్సతి నొల్లని పతికి బద్ధసఖ్యము గలుగ
న్మతి నిర్వహించి కూర్చిన
చతురిక యగు దూతికాప్రసంగము వినుమా. 345

వ. అని యిట్లనియె. 346

మూఁడవ కథ

తే. అభ్రచుంబితమణిగణాదభ్రవప్ర
మై విజయభవనమను వీ డవనిఁ గలదు
ములికినాఁ డను సీమఁ గోమలుల చూపు
ములికి నాటిన మరుఁడు దా మూర్ఛ నొంద. 347

క. ఆరాజధాని వెలయు ను
దారుం డను రాజు ప్రోవఁ దన్నృపుచెంతన్
ధీరుఁడు తన ముక్కాకలఁ
దీఱిన దళవాయి యొకఁ డతిస్థిరబలుఁడై. 348