పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చరవసువు నతనికి బృహద్రథ, ప్రత్యగ్ర, కుశాంబ, కుచేల, మాత్స్య
ప్రముఖు లేడ్వురు గలిగిరి. బృహద్రథునకుఁ గుశాగ్రుండు నతనికి వృష
భుండు నతనికిఁ బుష్పవంతుండు నతనికి సత్యహితుండు నతనికి సుధన్వుండు
నతనికి జతుండు గలిగె. మఱియు బృహద్రథునకుఁ గుమారశకలద్వయంబు
పుట్టె. అది జరచేత సంధింపంబడుటం జేసి జరాసంధుండనఁ బుత్రుండు
గలిగె. అతనికి సహదేవుండు నతనికి సోమపుండు నతనికి శ్రుతిశ్రవుండు
కలిగె. వీరలు మాగధులను భూపాలు రైరని చెప్పి శ్రీపరాశరుండు మైత్రే
యున కిట్లనియె.

435


క.

వినుము మునీంద్ర! పరీక్షి, జ్జననాథున కాత్మజులు విశాలయశస్కుల్
జనియించిరి నలువురు, తద్ఘనచరితము నీకుఁ జెప్పెదం బరిపాటిన్.

436


వ.

పరీక్షితునకు జనమేజయశ్రుతసేనోగ్ర సేనభీమసేనులు నల్వురుపుత్రులు
కలిగిరి. జహ్నునకు సురథుండు సురథునకు విదూరథుండు, విదూరథునకు
సార్వభౌముండు, సార్వభౌమునకు జయత్సేనుండు, జయత్సేనునకు నారా
ధితుండు, నారాధితున కయుతాయువు, నయుతాయువునకు నక్రోధనుండు,
నక్రోధనునకు దేవాతిథి, దేవాతిథికి ఋక్షుండు, ఋక్షునకు భీమసేనుండు,
భీమసేనునకు దిలీపుండు, నతనికిఁ బ్రతీపుండు, ప్రతీపునకు దేవాపి, శంతను,
బాహ్లీకులు ముగ్గురు పుత్రులు పుట్టిరి. అందు దేవాపి కొండుకనా డర
ణ్యంబు ప్రవేశించిన శంతనుండు రాజయ్యె వినుము.

437


క.

శంతనుఁ డశేషశాత్రవ, కృంతనుఁడై జలధివృతనిఖిలభూవలయా
క్రాంతి మహనీయతరవి, క్రాంతి విభాసితుఁడు వెలసె రవిచందమునన్.

438


గీ.

చేతనంటినవృద్ధుండు చిఱుతవయను, నొంది మహనీయశాంతిఁ బెంపొందుకతన
శంతనుం డని తను జనుల్ సన్నుతింప, వెలసెఁ గొనియాడదరమె యవ్విభునిమహిమ.

439


వ.

ఇట్లు రాజ్యం బేలుచున్నంత.

440


ఉ.

శంతనుఁ డేలుదేశము ప్రజల్ బెగడొందఁగ వృష్టి మాన్చె జం
భాంతకుఁ డద్భుతం బొదవ నబ్దములాఱును నాఱు నమ్మహీ
కాంతుఁడు నంత విప్రతతిఁ గన్గొని నాయపరాధ మేమి దు
ర్దాంతనితాంతలోకభయదప్రళయావహవృష్టిహానికిన్.

441


క.

అని తము నడిగిన యాశం, తనుఁ గనుగొని విప్రవరులు నరనాయక! యీ
యనుపమితావగ్రహ మి, ట్లొనరుటకుం గలదు హేతువొక్కటి వినుమా.

442