పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

కనలుచు నార్చి పట్టుకొనఁగాఁ బఱతెంచిన వారు భీతులై
వనమునఁ బాఱిపోవఁగ జవంబున వెన్నడిపోయి విపునిం
బనుపడఁ బట్టుకొన్నఁ గని బ్రాహ్మణి యిట్లను విప్రుఁ బుణ్యవ
ర్తనుని మదీయవల్లభుని ధర్మము తప్పి వధింపఁ బాడియే.

149


గీ.

అకట యిక్ష్వకువంశంబునందుఁ బుట్టి, నట్టినృపతులు ధర్మమార్గైకరతులు
నీవు తత్కులమునఁ బుట్టి నింద్యకర్మ, మాచరింపంగఁదగునయ్య నీచవృత్తి.

150


వ.

నీవు మిత్రసహుండను మహారాజవు, రాక్షనుండవుగావు; స్త్రీధర్మసుఖాభిజ్ఞుం
డవు; మన్మనోరథంబు గాకుండ మద్వల్లభుని వధియింపవలదని బహుప్రకారం
బుల విలపించుచుం బ్రార్థించిన వినక వ్యాఘ్రంబు పశువుం జంపినవిధంబున
బ్రాహ్మణుం జంపి భక్షించె. అంత నాబ్రాహ్మణి యగ్నిప్రవేశంబు చేయం
దలంచి కోపోద్దీపితమానసయై.

151


గీ.

నామనోరథమునకు విఘ్నంబు చేసి, భర్తఁ జంపితి వీపాపఫలముకతన
నంగనామణిఁ గవిసిన యపుడు నీవు, పంచత భజించు మనుచు శపించె నపుడు.

152


వ.

ఇట్లు శపించి పతి ననుగమించె. నంత ద్వాదశాబ్దంబులు నిండిన శాపకృత
రాక్షసభావంబు పోయిన మిత్రసహుండు నిజపురంబునకు వచ్చి నిజపత్ని
యగు మదయంతి రావించి మదనక్రీడ లపేక్షించిన నద్దేవియు శాపప్రకారం
బెఱింగినదై వారించె. ఆతుడును రతిపరాఙ్ముఖుఁడై యుండె నంత.

153


క.

అనపత్యుఁడై నృపాలుఁడు, తనగురుని వశిష్ఠమౌనిఁ దగఁ బ్రార్థింపన్
మునియును మదయంతికి ము, ద్ఘనచిత్తాంబురుహుఁ డగుచు గర్భము చేసెన్.

154


గీ.

కాంత మదయంతి యేడేండ్లు గర్భభరము, పూని వేసరి యొకఱాతఁ బొడిచికొనిన
గర్భము కలంగి సుతుఁడు భాస్కరనిభుండు, పుట్టె నశ్మకుఁ డని జగంబులు నుతింప.

155


వ.

అయ్యశ్మకునకు మూలకుండగు పుత్రుండు కలిగె. అతండె కదా పరశు
రాముండు భూతలంబు నిఃక్షత్త్రంబు సేయునెడ వివస్త్రలైన స్త్రీలచేతం
బరివృతుండై రక్షింపంబడి నారీకవచుం డనం బరఁగె. అట్టి మూలకునకు ద
శరథుండు నతనికి నిలిబిలి యతనికి విశ్వసహుండు నతనికి ఖట్వాంగుండు
కలిగె.

156


సీ.

ఖట్వాంగమేదినీకాంతుండు దేవాసు, రాహవంబున సమభ్యర్థితుఁ డయి
సురలకుఁ దోడ్పాటు చూపి దైతేయులఁ, బరిమార్చి గెల్చిన సురలు మెచ్చి