పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ధన్యుఁ డవ్యక్తవిస్పష్టతనుఁ డనంతుఁ, డఖిలరూపుఁ డశేషతేజోతిశాయి
యనఁగఁ బొగడొందు శ్రీవిష్ణునందు నాదు, చిత్త మిడి ముక్తిఫలము వాంఛింతు నెపుడు.

101


క.

గురువులకుఁ బరమగురువగు, సరసీరుహపత్రనేత్రు శరణార్థిజనో
త్కరసుఖదాయకుఁ గరుణా, భరణున్ శ్రీవిష్ణుదేవుఁ బ్రార్థింతు మదిన్.

102


వ.

అని యివ్విధంబున సౌభరి తనుదాన యుపశమించుకొని పుత్రగృహాసన
శయనపరిచ్ఛదాదికంబగు వస్తుజాతంబును విడిచి సకలభార్యాసమేతుండై
వనంబు ప్రవేశించి యందు ననుదినంబును వైఖానసనిష్పాద్యంబగు ననేక
క్రియాకలాపంబు నిష్పాదించి క్షపితసమస్తపాతకుండును బరిపక్వమనో
రథవృత్తియు నగుచు నగ్నుల నాత్మారోపణంబు చేసి భిక్షకుండై యజన్మ
వికారమరణాదికంబగు నచ్యుతపదంబు నొందె. ఇది మాంధాతృదుహితృ
సంబంధాఖ్యానంబు.

103


ఉ.

ప్రేమఁ దలిర్ప సౌభరిచరిత్రము విన్నఁ బఠించి చెప్ప ను
ద్దామవిభూతి జ్ఞానము సదాతనధర్మము నిర్మమత్వమున్
గామజయిత్వముం గని సుఖస్థితి మానవుఁ డొందు మోక్షల
క్ష్మీమహనీయసౌఖ్యము భజించు నచంచలత న్మునీశ్వరా.

104


వ.

ఇంక మాంఛాతృపుత్రసంతతి వివరించెద. మాంధాతృపుత్రుండైన
యంబరీషునకు యువనాశ్వుండు, యువనాశ్వునకు హారీతుండు, హారీతున
కాంగిగసులన షట్కోటిసంఖ్యాతులు పుత్రులు పుట్టిరి. రసాతలంబున మౌనేయ
నామగంధర్వులు నాగకులంబుల ధనరత్నాధిపత్యంబులు హరించిన
గాంధర్వవీర్యావధూతులై నాగపతులు చని.

105


సీ.

అఖిలదేవేశు నుద్యత్పుండరీకలో, చను యోగనిద్రావసానసుప్ర
సన్నుఁ బన్నగశాయిశరణుఁ జొచ్చి భుజంగ, పతు లెల్ల తమపడ్డపాటు విన్న
వించిన నిందిరావిభుఁ డాదరించి కొం, దల మేల మీకు మాంధాతృపుత్ర
కుఁడు పురుకుత్సుఁ డనురుబలాఢ్యుఁడు గలఁ, డతనిశరీరంబు నధివసించి


గీ.

దుష్టగంధర్వతతి నెల్లఁ ద్రుంతుఁ బోయి, యతనిఁ బురికొల్పుఁ డనుచు దేవాదిదేవుఁ
డందఱును జూడఁగా నదృశ్యత్వ మొందె, భుజగపతులును నిజపురంబునకు వచ్చి.

106


మ.

జగతీశర్మదనర్మదన్ భుజగరాజన్యాగ్రణు ల్వంప శీ
ఘ్రగయై యాపురుకుత్సభూవిభునిఁ జేరంబోయి తత్కార్య మ
చ్చుగఁ జెప్ప న్విని వచ్చి విష్ణుఘనతేజోవర్ధితుండౌటఁ బ
న్నగలోకంబు సుఖింపఁ గీటడఁచె గంధర్వేంద్రుల న్వ్రేల్మిడిన్.

107