పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దు నవీనద్యుతిసౌధముల్ గల వొకండుం దక్కువా యెంత యై
నను విభ్రాంతిఁ దలంపరే మగువ లన్నా! కన్నవారి న్మదిన్.

83


ఉ.

సంతతభోగసంపదలు సంభృతవైభవసంభ్రమంబు ల
త్యంతవినోదముల్ గల వహర్నిశముం బతి నన్నుఁ బాయఁ డి
ట్లెంతని చెప్పుదున్ భగిను లెన్నఁడు భర్తమొగంబు గాన రీ
చింత దురంతమై మనసు చిల్లులు పుచ్చుచునున్న దెప్పుడున్.

84


వ.

అని పలికిన నమ్మహీపతి యచ్చటనుండి మఱియునొక్కప్రాసాదంబునకు వచ్చి
యచ్చట నలంకృతయైన తనూభవం గాంచి కౌగిలించి కుశలం బడిగిన నదియును
మునుపు చెప్పిన కుమారిక పగిదిఁ జెప్పిన నిప్పగిది నందఱిప్రాసాదంబులకుం
బోయి యడిగిన నందఱు తమకుఁదమక సకలభోగంబులు కలవు. వల్లభుండు
తమతమక వశ్యుండని చెప్పిన సంతసించి యేకాంతావస్థితుండగు సౌభరిం
గాంచి సత్కృతుండై మాంధాతృం డిట్లనియె.

85


గీ.

మౌనికులనాథ నీతపోమహిమకొలఁది, తలఁప శక్యంబె దేవతాతతులకైన
భూరితరమైన దేవరవారిదివ్య, వైభవము గంటి నేత్రపర్వంబు గాఁగ.

86


చ.

అని కొనియాడి భూమిపతి యమ్మునిచేఁ బ్రతిపూజ నొంది య
త్యనుపమభోగభాగ్యవిభవాతిశయంబుల కాత్మ మెచ్చుచున్
దినములు కొన్ని యచ్చట నతిప్రమదంబున నిల్చి పోయె ది
గ్వినుతధనాదిసంపదలవిశ్రుతయౌ నిజరాజధానికిన్.

87


గీ.

అంతఁ గొంతకాల మరుగ నారాజక, న్యకలయందు వరుస నత్తపోభి
రాముఁ డర్థిఁ గాంచెఁ బ్రాజ్ఞుల నూటయేఁ, బండ్రునందనులఁ బ్రభావయుతుల.

88


నందనులఁ గాంచి పరమా, నందంబున నుండె మౌనినాథుఁడు వనితా
బృందము దానును బెనుచుచు, నందంద మహామమత్వ మగ్గల మైనన్.

89


సీ.

బాలురనునుముద్దుఁబల్కు లెన్నఁడు వినఁ, గలుగునో యని కోరఁ బలుకనేర్చి
రవనిమీఁద కుమారు లడుగిడి నడుచు టె, న్నడొకో యనుచు కోర నడవనేర్చి
రర్భకు లారూఢయౌవను లగుటెన్నఁ, డో యని కోరఁ బెంపొందెఁ బ్రాయ
మాత్మజు లుద్వాహ మగుట యెన్నఁడెకో య, నుచుఁ గోరఁ బెండ్లిండ్లరుచులు గనిరి


గీ.

సుతులు గనఁజూతురో యన సుతులఁ గనిరి, ప్రోదిమనుమల నెత్తుదురో యనంగ
మనుమలం గనుఁగొనుభాగ్యమహిమఁ గనిరి, సౌభరికుమారకులు పితృస్వాంత మలర.

90


వ.

ఇవ్విధంబున దినదినప్రవర్ధమానవిషయలాలసుండై యమ్ముని యిట్లని చిం
తించె.

91