పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేవుండన నఖండప్రభావంబున నున్నవాఁడు. అమ్మహానుభావునకుఁ గన్యా
రత్నంబు నిమ్ము పొ మ్మనిన రైవతుండు భూలోకంబునకు వచ్చి.

32


గీ.

కుఱుచలై యల్పతేజులై గుణవివేక, బలసమృద్ధులఁ దక్కులై ప్రబలు ప్రజలఁ
గాంచి వెఱఁగొందుచును, ద్వారకానగరికి వచ్చి రామున కక్కన్య నిచ్చె నృపుఁడు.

33


చ.

బలుఁడు నతిప్రమాణయగు పద్మదళాయతచారులోచనన్
హలమున వంచి యంచితశుభావయవన్ఫుటగాత్రిఁ జేసి పెం
పలవడఁ బెండ్లియై ప్రముదితాత్మకుఁడై యనురాగభాగనే
కలలితకామభోగములు గైకొనియుండె నఖండసంపదన్.

34


క.

అనురూపవరున కాత్మజ, ననువొందఁగ నిచ్చి ప్రముదితాత్మకుఁడై యా
జనవిభుఁడు తపము చేయన్, జనియె హిమాచలమునకుఁ బ్రసన్నత్వమునన్.

35


వ.

రైవతుండు బ్రహ్మలోకంబునకుం బోయి రాకయున్న వెనుకఁ బుణ్యజనసంజ్ఞ
లుగల రాక్షసులు కుశస్థలిపై దాడి పెట్టిన రైవతుని తోఁబుట్టువులునూర్గురు
రాక్షసపరాజితులై నానాదిక్కులకుం బోయిరి. వారలయన్వయంబునం బుట్టి
నక్షత్రియులు సర్వదిక్కులందు నిలిచిరి. ధృష్టునకు ధర్షంబను క్షత్రియ
కులంబు పుట్టె. నాభాగునకు నాభాగుండు, నాభాగునకు నంబరీషుండు, నంబరీషు
నకు విరూపుండు, విరూపునకు వృషదశ్వుండు, వృషదశ్వునకు రధిరతుండు పుట్టి
వీరాంగీరసులను క్షత్రోపేతులైన ద్విజు లైరి.

36


క.

క్షుత మొనరింపఁగ మనువున, కతులఘ్రాణమునఁ బుట్టె నాత్మజుఁడు బలా
న్వితుఁ డిక్ష్వాకుఁ డనంగా, నతనికి [1]నూర్వురు కుమారు లైరి మునీంద్రా.

37


వ.

వారిలోపల మువ్వురు వికుక్షినిమిదండాఖ్యులు శ్రేష్ఠులు. శకునిప్రముఖు లేఁ
బం డ్రుత్తరాపథంబునకు రాజు లైరి. నలువదియెనమండ్రు దక్షిణాపథంబునకు
రాజు లైరి. అయ్యిక్ష్వాకుం డొక్కనాఁడు

38


సీ.

అష్టకాశ్రాద్ధకర్మారంభ మొనరించి, యర్హమాంసంబు తెమ్మనుచుఁ దనదు
కొడుకు వికుక్షిఁ బేర్కొని పిల్చి పంపిన, నడవికిఁ బోయి యర్ఘంబులైన
మృగముల వధియించి మించినయాకటఁ జనలేక యం దొక్కశశము దిని, క
డమమాంసమంతయుఁ దమతండ్రి కిచ్చిన, నది ప్రోక్షణము చేయ నరుగుదెంచి


గీ.

కులగురుండు వసిష్ఠుఁ డక్కొదవ యెఱిఁగి, కనలి యీమాంస మర్హంబు గాదు వీఁడు
మీఁదు వుచ్చెనటన్న నమ్మేదినీశుఁ డాత్మనందను విడిచె సంయమివరేణ్య

39
  1. “నతనికి నేకశతపుత్రు లైరి మునీంద్రా.” ?