పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సమేతంబులుగాఁ జెప్పి జలాంజలి నీయవలయు. అంత గోవులు ప్రవేశించువేళ
నక్షత్రదర్శనంబు సేయుచు గ్రామంబు ప్రవేశింపవలయు. భూమి కటుప్రస్తర
శాయిత్వంబు వలయు. అనుదినంబును ప్రేతార్ధంబు భూమియందుఁ పిండంబు
విడిచి దివాభాగంబున మాంసవర్జంబుగా భుజియించి తమదినంబులు వెళ్లింప
వలయు. ప్రథమ, తృతీయ, సప్తను, నవమదినంబుల వస్త్రత్యాగబహి
స్స్నానంబులు చేసి తిలోదకంబు లీయవలయు. మూఁడవదివసంబున నస్థిసంచ
యనంబు సేయవలయు.

221


గీ.

అస్థిసంచయనము చేసినంతనుండి, యవనినాథ సపిండుల నంటవచ్చు
విను సమానోదకులు భోగవిధులు దక్క, నర్హు లగుదురు సర్వక్రియలకు నధిప.

222


వ.

సంచయనంబు చేసినవెనుక సమానోదకులకు, సపిండులకు స్త్రీసమాగమంబు
చేయరాదు. బాలుండును, దేశాంతరస్థుండును, బతితుండును, మునియు, జలా
గ్న్యుద్బంధనాదులయందు మృతులైన జ్ఞాతులకు సద్యశ్శౌచంబు విధియింపం
బడియె. మృతబంధుని యన్నంబు పదిదినంబులు భుజింపరాదు. దానప్రతి
గ్రహణయజ్ఞస్వాధ్యాయంబులు జేయరాదు. విప్రునకు బదిదినంబులును,
రాజన్యునకుఁ బండ్రెండుదినంబులును, వైశ్యునికి బదేనుదినంబులును,
శూద్రునకు మాసం౦బును నాశౌచంబు. వీరలు స్వకులోచితంబుగా శ్రాద్ధంబు
చేయవలయు.

223


గీ.

భూపవర్య యయుగ్మంబులుగ విప్ర, వరుల భుజియింపఁజేయఁగావలయు శ్రద్ధ
దనరఁ బిండంబు నిడఁదగు దర్భతతుల, పైని మృతుఁ గూర్చి యుచ్ఛిష్టపార్శ్వభూమి.

224


వ.

ఇట్లు యథోక్తంబు శ్రాద్ధంబు చేసి సపిండీకరణంబు చేసి ప్రేతత్వంబు మాన్చి
పితృత్వంబు నొందించి యుత్తరక్రియలు నడుపవలయు. పుత్త్రులు, దౌహిత్రులు
తత్పుత్త్రులు వీర లెవ్వరైనను నుత్తరక్రియలు నడపవలయు. అవి యెఱింగించె
ద వినుమని యౌర్వుం డిట్లనియె.

225


చ.

జలజభవేంద్రరుద్రవసుసారసమిత్రహుతాశనానిలం
బులు పితృవిశ్వదేవగణముల్ ఋషిమానుషపక్షిపన్నగం
బులు పశువుల్ సమస్తమగు భూతగణంబులుఁ దృప్తి నొందు ని
శ్చలమగు శ్రద్ధతో నరుఁడు శ్రాద్ధము చేసినఁ బార్థివోత్తమా.

226


వ.

ప్రతిమాసంబున నమావాస్యయందును శ్రాద్ధంబు చేయవలయు. ఇంకఁ గామ్యు
శ్రాద్ధంబు వివరించెద. వ్యతీపాతయోగంబున, విషువత్కాలంబున, సూర్య
సోమగ్రహణకాలంబునఁ, బండ్రెండుసంక్రాంతులు, నక్షత్రగ్రహపీడల, దుష్ట
స్వప్నావలోకంబుల, నవసస్యాగమనంబుల నిచ్ఛాశ్రాద్ధంబు సేయవలయు.

227