పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అగ్నికార్యంబు దీర్చి యనంతరంబ, యభిమతసురార్చనము చేయు టర్హవిధము
ప్రకటతరషోడశోపచారములచేత, ధీరమతి సద్విజుఁడు సదాచారపరత.

164


వ.

బ్రహ్మకుఁ, బ్రజాపతికి, గృహ్యదేవతలకుఁ, గశ్యపునకుఁ, ననుమతికి వేల్చిన
హుతశేషంబు గొని మణికంబునందుఁ బృథివీపర్జన్యులకు బలి యిడి గృహద్వా
రంబున ధాతృవిధాతలకు గృహమధ్యంబున బ్రహ్మకు బలి యిడి యింద్ర ధర్మ
రాజవరుణధనేంద్రులకుఁ గ్రామంబునఁ బ్రాచ్యాదిచతుర్దిక్కుల బలు లిడి
ప్రాగుత్తరదిగ్భాగంబున ధన్వంతరికి బలి యిడి తదనంతరంబ, వైశ్వదేవంబు
చేసి వాయవ్యభాగంబున వాయువునకుఁ దక్కినదిక్కుల నయ్యైదేవతలకు
బ్రహ్మకు, నంతరిక్షంబునకు, భానునకు బలి యిడి విశ్వదేవతలను, విశ్వపతులను,
బితరులను, యతిభిక్షులను నుద్దేశించి బలి యిడవలయును. అనంతరం బన్నాం
తరంబు పుచ్చుకొని శుచిదేశంబున శేషభూతంబులకు దేవమనుష్యపశు
వయస్సిద్ధయక్షోరగదైత్యప్రేతపిశాచతరుపిపీలికాకీటపతంగాదులు మద్వి
సృష్టాన్నంబునఁ దృప్తి బొందుదురుగాక యని బలి యిడి తదనంతరంబ గృహ
బహిర్భాగంబున శ్వచండాలాదిజాతులకు బలి యిడి యతిథిసంగ్రహార్థము
గోదోహనమాత్రకాలంబు నిలిచి.

165


సీ.

అజ్ఞాతకులనాము నన్యదేశాగతు, శ్రమజలాసారసంఛన్నవక్త్రు
నతిపిపాసాక్షుత్సమాదూయమానాంగు, మార్గధూళీవిద్యమానదేహు
నాభీలగమనపుంజీభూతనిశ్వాసు, రభసాముహుర్ముహుర్భంజితోష్ఠు
ననుపమాకించనత్వాలోకనీయాత్ము, నస్పృష్టసంబంధు నర్చనీయు


గీ.

నతిథి గని మ్రొక్కి సంతోషితాత్ముఁ డగుచుఁ, దోడుకొని వచ్చి లోన నిర్దుష్టశాస్త్ర
విధులఁ బూజించి సద్భక్తి వెలయ నన్న, మిడఁగవలయు గృహస్థుండు నృపవరేణ్య.

166


వ.

అతిథి బూజింపక భుజించెనేని యధోలోకంబులం బడు. భోజనానంతరంబ
స్వాధ్యాయకులాదు లడుగవలయు.

167


క.

మనమున హిరణ్యగర్భుం, డని తలఁచుచు నతిథుల కెలమి నన్నం బిడఁగాఁ
జనునతిథి స్వర్గదాయకుఁ, డని చెప్పుదు రార్యజనము లమలచరిత్రా.

168


వ.

పిత్రర్థంబు తద్దేశ్యుండును, విదితాచారసంభూతియుఁ, బాంచయజ్ఞకుండును
నైన యొక్కవిప్రునిం భుజియింపంజేయవలయు. ఒక్కయెడ నెత్తి పెట్టిన
హంతకారోపకల్పితంబగు నగ్రాన్నం బొక్కశ్రోత్రియునకుం బెట్టవలయు.
పరివ్రాడ్బ్రహ్మచారులకు భిక్షాత్రితయంబు పెట్టవలయు. విభవంబు గలిగిన
నవారితంబుగా నిడవలయు. అతిథియు, బిత్రర్థబ్రాహ్మణుండును, హంతకార
భోక్తయు, భిక్షావృత్తులగు బ్రహ్మచార్యాదులుం గూడ నాలుగుదెఱంగుల