పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

గార్హస్థ్యంబు గావలసి ననేకగుణవర్ష యైనకన్యకను దాను ద్రిగుణవర్షుండై పరి
గ్రహింపవలయు

146


సీ.

అతికేశియు నకేశి యధికాంగి కృష్టాంగి, పింగళన్యూనాంగి యంగహీన
రోగిణి, కులట, యరూపిణి, దుష్టవా, త్సల్యసరోషయు శ్మశ్రువదన
కాకస్వర కృశాంగి మల్హరస్వర పురు, షాకృతి బుద్ధాక్షి యరుణదృష్టి
పీనాంగి వామన పృధుదీర్ఘసంహత, భ్రూయుగరూక్షాంగి క్రుద్ధవదన


గీ.

చిత్రదంత మషీవర్ణ శ్వేతవర్ణ, కూపగండ సమున్నతగుల్భరోమ
సహితజంఘ వినిందితాచార యైన, కన్యఁ బెండిలియాడఁగఁ గాదు బుధులు.

147


వ.

మాతృపక్షంబునఁ బంచమియుఁ బితృపక్షంబుస సప్తమియు నైనకన్యకను
యథావిధి వివాహంబు గావలయును. బ్రాహ్మ్యంబు దైవంబు నార్హంబు బ్రాజా
పత్యంబు నాసురంబు గాంధర్వంబు రాక్షసంబు పైశాచంబు నన నెనిమిది
వివాహంబులు. అం దేవర్ణంబున కేవివాహంబు విహితం బావివాహిం బావ
ర్ణంబువారు చేయవలయు. ఇవ్విధంబున సలక్షణయైన ధర్మచారిణిని బరి
గ్రహించి తత్సహితుండై గృహస్థుండు విహితకృత్యంబులు నడిపి సమ్యగూర్ధ్వ
మహాఫలంబు నొందునని చెప్పిన సగరుం డిట్లనియె.

148


గీ.

మౌనినాథ! సదాచార మానతిమ్ము, కరుణతో నాకు శ్రవణేచ్ఛ గడలుకొనియెఁ
దాన నడిచి గృహస్థుండు మాననీయ, దివ్యలోకసుఖాప్తి మోదించుఁగాదె.

149


వ.

అనిన నౌర్వుం డిట్లనియె.

150


మ.

జననాథోత్తమ చెప్పెద న్విను సదాచారంబు నిత్యంబు స
జ్జను లత్యాకృతి నాచరించుట సదాచారంబనం జెల్లు స
జ్జనసంజ్ఞుల్ మనువుల్ ప్రజాపతులు నాసప్తర్షులుం జువ్వె త
ద్వినుతాచారపరాయణుండు గను ఠీవిన్ రెండులోకంబులున్.

151


గీ.

రాజ! విను ధర్మపీడాకరంబులైన, యర్థమును గామమును మాను టర్హ మగును
అసుఖమై లోకవిద్విష్ట మయ్యెనేని, ధర్మమును మానవలయు భూధరవరేణ్య.

152


వ.

కాల్యంబున న్లేచి తననివాసంబునకు నైరృతిభాగంబున నంపకోల వాఱినంత
దూరము పోయి యచ్చట మూత్రపురీషంబుల విడువవలయు

153


క.

తననీడఁ దరువునీడన్, విను గోరవివహ్నివాతవిప్రగురువులం
గనుచు నెదురుగను విడువం, జనదు మలము మూత్రమును బ్రశస్తున కెపుడున్.

154


గీ.

పైరులో దుక్కిలో మందపట్టునందు, తెరువులో నీటిలో నదీతీర్థములను
మసనమున నేటిదరియందు మానవుండు, మలము మూత్రంబు విడువరా దలఘుచరిత.

155