పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


థర్వణరూపంబుల నాలుగుతెఱంగులుగా విభజించె. ఆకృష్ణద్వైపాయనుండు
సాక్షాన్నారాయణుండుగా నెఱుంగుము. అతండు దక్క నన్యులకు నపార
భారతసాగరంబు నిస్తరింప శక్యంబే. ఆవ్యాసుండు బ్రహ్మచేత నియుక్తుండై
వేదంబు నాల్గుతెఱంగుల విభజించి శిష్యులం జదివించె. తత్ప్రకారంబు
వినుము.

52


సీ.

శమదమప్రతిభావిశాలుండు పైలుండు, కృతమతిఁ జేసె ఋగ్వేదపఠన
సద్గుణాయనుఁడు వైశంపాయనుఁడు, శుభాయతి యజురామ్నాయ మధిగమించె
వినుతనిష్కామి జైమినిమునిస్వామి సం, భావనానియతి సామము పఠించె
మహనీయత మహామతిమంతుఁడు సుమంతుఁ, డధికప్రభ నథర్వ మధిగమించె


గీ.

రోమహర్షణతనయుండు రుచిరవినయుఁ, డతులితఖ్యాతుఁడౌ సూతుఁ డల పురాణ
సహితసకలేతిహాసముల్ చాలఁ జదివె, నక్షయవ్యాసకరుణాకటాక్షమహిమ.

53


వ.

వేదంబులయందు యజుస్సులచేత యజుర్వేదంబును, ఋక్కులచేత ఋగ్వేదం
బును సామంబులచేత సామవేదంబును, నథర్వంబుల చేత నథర్వవేదంబును
నయ్యె. అయ్యథర్వంబు రాజులకు సర్వకర్మసాధనం బయ్యె. ఇట్లు వేదవ్యా
సుండు వేదకాననంబును జతుర్విధంబుగా విభజించె. అందు పైలుడు ప్రథ
మంబు ఋగ్వేదంబు నింద్రప్రమతికి నిచ్చె. ఆయింద్రప్రమతి భాష్కలున కిచ్చె.
ఆభాష్కలుండు బోధ్యాదులైన శిష్యుల కిచ్చె. ఆబోధ్యాదులవలన యాజ్ఞ
వల్క్యపరాశరులు గ్రహించిరి. ఇట్లు శాఖోపశాఖల ఋగ్వేదంబు వెలసె. ఆ
యింద్రప్రమతి నిజపుత్రుండైన మండూకేయునిం జదివించె. అతనిశిష్య
ప్రశిష్యులవలన విస్తరిల్లె. అతనిపుత్రుండు వేదమిత్రుండు ముద్గల, గోముఖ,
వాచ్య, శాలీయ, కౌశికులను శిష్యపంచంబునకు సంహితాపంచకంబుఁ జెప్పె.
ఇవ్విధంబున ఋక్కులు బహువిధంబులై కీర్తితంబు లయ్యె.

54


క.

మునివర వైశంపాయన, మునివరుఁడు యజుర్నిగమము మును పిరువదియే
డనుపమశాఖలు గావిం, చి నయం బొప్పఁగ నొసంగె శిష్యుల కెల్లన్.

55


సీ.

మునివరు ల్తొల్లి సమూహమై మేరుభూ, ధరకూటమున నుండి తమరు చేసి
రొక్కమర్యాద శిష్యులఁ గూడి యే, ఋషియైన నెచ్చోటకు నరిగెనేని
యతనికి సప్తరాత్రాంతరంబున బ్రహ్మ, హత్య వాటిలు నని యది యెఱింగి
మును లెవ్వ రెచ్చోటికిని బోవ రంత వై, శంపాయనుఁడు శిష్యసమితితోడ


గీ.

నచ్చటికిఁ బోయి యవశాత్ముఁ డగుచు నపుడు, స్వప్రియుని నొక్కబాలకు చరణతాడ
నాభినిహతునిఁ జేసిన నాక్షణంబె, భవ్యునకు నాయనకు వచ్చె బ్రహ్మహత్య.

56