పుట:విక్రమార్కచరిత్రము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47

"గ్రంథ మంధశబ్దంబులఁ గల ద్వితీయ
వర్ణములు రెండును నఘోషవర్ణములగు
నైన నిజవర్గభవ చతుర్ధాక్షరములఁ
గలియుం బ్రాసంబులును స్వవర్గజములనఁగ."

అని యిట్లు తవర్గ ద్వితీయ చతుర్ధాక్షరములకు థ ,ధ, లకుఁ బ్రాసమైతి చెప్పెను. మఱియు కవిత్రయము వారి పద్యములలో తవర్గ తృతీయ చతుర్థాక్షరము లనఁగా ద, ధ లకుఁ బ్రాసము గూర్పఁబడియుండుటచే థ, ధ లకును, ద, ధ లకు బ్రాసము చెల్లుననుట ప్రసిద్ధము. కాని వీనికి వర్గప్రథమాశరముతో గూడ ప్రాసము చెల్లునని చెప్పఁబడలేదు. థ, ధ లకును, ద, ధ లకును బ్రాసము చెల్లునపుడు త, ద లకు నేల చెల్లకుండవలె ననుట వేఱు విషయము. ఇందులకు బూర్వకవి ప్రయోగము లేవి యున్నట్లు లేవు. కావునఁ బై పద్యము నందలి ద్వితీయ చరణాదినిఁ గల 'చతురత' యనునది యర్ధభేదము లేకుండ 'చదురున" యని నాల్గుపాదము లందును (ద) ప్రాసము కుదురునట్లు సవరింపఁబడినది. పూర్వప్రతి పాఠము గూడ పుట యడుగున నీయఁబడినది. చిన్నచిన్ సవరణలు పెక్కు లున్నను పైనిఁ దెల్పఁబడినవి ప్రధానమయినవి.

విక్రమార్కచరిత్రము వంటి యుత్తమప్రాచీనకావ్యముల ముద్రితప్రతుల కీనాఁడు అంజనము వేసి చూడవలసిన దురవస్థ యేర్పడినది. ఇట్టి పరిస్థితిని గమనించి ప్రాచీనాంధ్రకావ్యములను బాఠకలోకమునఁ బునఃప్రచారమునకుఁ దెచ్చుటకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ దీక్షాకంకణముఁ గట్టుకొన్నది. అకాడమీ వారి యీ ఉపక్రమము నిజమున కొక సాహిత్యయజ్ఞము. ఏతదధ్యక్షుడు డాక్టరు బెజవాడ గోపాలరెడ్డిగారు యీ సారస్వతేచ్ఛకి యజమానులు. కళాభవనము చత్వరవేదిక . కార్యదర్శి శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు యాజ్ఞికులు. సహృదయపాఠకులు సదస్యులు. సాహిత్యప్రచారము సవనఫలము. ఈ క్రతునిర్వహణకార్యక్రమమున నొక ఋత్విక్కుగా వరించి, నాకును యత్కించిచ్భాగస్వామిత్వము నొసంగిన అకాడమీ వారికిని ముఖ్యముగా శ్రీ రామానుజరావు గారికిని కృతజ్ఞతలు.

పల్లా దుర్గయ్య

హైదరాబాదు
1-8-1987