పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాసిష్ఠరామాయణము


వ.

దానితో ని ట్లంటి.

231


క.

నిన్నటినుండియు నాఁకట
నున్ననిమిత్తమున దాహ మొదవెను; మేనున్
గన్నులును దిమ్మ దిరిగెడుఁ
గ్రన్నన నాదప్పి దీర్చి రక్షింపఁ గదే.

232


వ.

అనిన నాచండాలి నాయభిప్రాయం బెఱింగి తనతెచ్చిన పర్యుషితా
న్నంబునం గామోపచారంబులం బరితోషితుం జేసిన; నేనునుం దాని
చేసినతగవునుం దగులంటు నగ్గలించి విడుప నోపక తజ్జనకానుమతం
బున వివాహంబై దానియింటనె యుండి దానివలన నలుగురు కొడు
కులం గని పెద్దకాలం బాచండాలసంసారసుఖంబు లనుభవించుచు
నుండ; నంత నద్దేశంబునకు రాజోపప్లవంబు గదిరి యూళ్లు విడిచి
వలసలు పోవుచుండ నప్పుడు.

233


చ.

కడవలు కావటందు నిడి గ్రక్కున మూఁపున మోచి బిడ్డనిన్
దడయక వీఁపునం దునిచి తక్కినమువ్వురఁ దోడుకొంచు, నా
పడతియు గంప మోచికొని పల్మఱు దిట్టుచు వెంటఁ గూడి రా
నడవికి నేఁగి పె క్కిడుము లందితి నయ్యెడ నేమి సెప్పుదున్.

234


వ.

అంతఁ గొన్నిదినంబులకును.

235


క.

కొడుకులు నాలును గడు నల
జడి బడి గ్రాసంబు లేక సమసిన వారిన్
బెడఁబాసిన బహుదుఃఖము
దొడరిన సొద సొచ్చి మేను దొఱఁగితి నచటన్.

236


వ.

ఇట్లు వడిఁ దెలివొంది చనుదెంచితి. నింతయును శంబరునికృత్యంబ.
సకలజీవులకు మనోమాయ దుఃఖం బాపాదించుచుండు. నని యమ్మ
హీపతిపలుక; నంత నయ్యైంద్రజాలికుడు నంతర్ధానంబు నొందు
టయు, సభ్యు లాశ్చర్యహృదయు లై యారాజున కి ట్లనిరి.

237