పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

వాసిష్ఠరామాయణము


సెప్పెద నాకర్ణింపు మని యిట్లనియె.

217


క.

అవనికిఁ దొడ వగునొకపురి
లవణుం డనురాజు రాజ్యలక్ష్మీయుతుఁ డై
తివిరి యొకనాఁడు కొలువున
నవిరళగతి నున్నవేళ నాతనికడకున్.

218


క.

తిలకంబును మసిబొట్టును
జిలిబిలిబదినికెలపూసచేరులు దెలిగ
న్నులకాటుకయును గుంచెయు
బలుమందులు దనర నొక్కపాఱుఁడు వచ్చెన్.

219


వ.

ఇవ్విధంబున శంబరుం డను నైంద్రజాలికుండు చనుదెంచి యారాజును
దీవించి సభామధ్యంబున నిలిచి కొండొకసేపు నిమీలితాక్షుం డై.

220


క.

చప్పట్లు వెట్టి చేతులు
విప్పుడు మంత్రించి కుంచె విసరుచు రాగం
బొప్పుగ మొగసిరిఁ గాటుక
గప్పినకనుఁగవలఁ గొలువు కలయఁగఁ జూచెన్.

221


వ.

ఇట్లు సూచుటయు నతనిమాయాజాలంబునం బడి తత్సభాజనంబు
నిశ్చేష్టితం బై సూచుచుండె. లక్షణభూపాలుండును జిత్రరూపుచం
దంబున గద్దియ నొరిగి నిశ్చేతనుం డయి ముహూర్తద్వయం బుండి
మేను చెమర్ప నదరిపడి భయభ్రాంతచిత్తుం డగుచు సభ్యులం గనుం
గొని యొకయాశ్చర్యంబు వినుం డని యి ట్లనియె.

222


అల్పాక్కర.

మీ రిందు శంబరు మెచ్చి చూడ
నారూఢి నే నొక్కహయము నెక్కి
దూరించి పో వనదుర్గభూమి
భారంబుగాఁ జొచ్చె వాజివేగ.

223