పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

55


కలకల నై వచ్చె లీల కాంతునికడకున్.

104


వ.

ఇవ్విధంబునఁ జనుదెంచి తద్వృత్తాంతం బంతయు నెఱింగించిన నతం
డచ్చెరు వొందుచుండె నంత సరస్వతి యమ్మహీపాలునకుఁ బరమజ్ఞా
నోపదేశంబు చేసి నిజేచ్ఛ నరిగె. బద్మభూపాలుండు లీలయుం దాను
ను జీవన్ముక్తులై యెనుఁబదివేలయేండ్లరాజ్యసుఖంబు లనుభవించి,
పదంపడి దేహవిముక్తులయి దివంబునకుం జని రని లీలోపాఖ్యానంబు
సవిస్తరంబుగా నుపన్యసించి వసిష్ఠుండు రామచంద్రున కి ట్లనియె.

105


క.

కానఁబడు నీప్రపంచము
లీనం బని లోకులకుఁ దెలియ 'లీలోపా
ఖ్యానము' చెప్పితి మదిలో
నీ నిఖల మతథ్య మని గణింపు కుమారా.

106


సీ.

పరమ మధ్యాత్మంబు బ్రహ్మ మనాభాస
        మతిశుద్ధపద మంచితాత్మకంబు
శాంత మద్వైతంబు సత్య మనంతంబు
        సత్త్వ మానందంబు శాశ్వతంబు
నతుల మనిర్దేశ్య మమల మచిహ్నితం
        బతిశుద్ధ మనఁ గల దనఘ వినుము
కరుడు లేనట్టిసాగరముచందంబున
        నత్యంతగంభీర మై వెలుంగు


గీ.

నదియుఁ బరమాత్మ; దేహంబులందుఁ బొంది
పరఁగ నిర్వాతదీపంబుభంగిఁ దనరు
నదియ జీవాత్మకళ; యని యాత్మ నెఱుఁగు
ప్రకటవిజ్ఞానగుణసాంద్ర రామచంద్ర.

107


గీ.

అదియ సంసారవాసన లగ్గలించి
క్రమము దప్పక ఘన మహంకార మయ్యె,