పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

వాసిష్ఠరామాయణము

     చేతనాచలనంబు నొందించి విహంగంబు వినువీథినుండి నిజమంది
     రంబు ప్రవేశించి నట్లు క్రమ్మఱ తనశరీరంబు సొచ్చి బ్రహ్మచారి
     రూపంబున సుఖాసీన యై యుండి.198
ఉ. తారక మంద్ర మధ్యములు తానము లేర్పడఁ జంచరీకఝుం
     కారముభంగి సామములు గానము సేయఁగ, నల్ల నల్ల నా
     తారతరస్వరంబు విని తత్పతి సత్త్వగుణైకచేతనం
     బారఁ బ్రబుద్ధ మై తనరె నామనిఁ బద్మిని పొల్చుకైవడిన్.199
సీ. ఇబ్బంగి మేల్కని యెదురఁ గుంభునిఁ గాంచి
                    యర్చించి నిలిచిన యానృపాలుఁ
     జూచి ౼ జీవన్ముక్తి సుస్థితి నొందెనె?
                    పరమచిదానందపదవియందు,
     విశ్రాంతి నొందితె? విదిత మై యది భేద
                    మి దభేద మనుబుద్ధి యెడలె నయ్య?
     ఆపాతరమ్యంబు లైనసంకల్పంబు
                    లరిగెనె? చిద్దర్శి వైననీకు
గీ. సమము నాధేయహేయదశావ్యతీత
     మును బ్రశాంతముఁ బ్రాప్తార్థమోదమయము
     నగుచుఁ జల్ల నై యున్నె నీయంతరంగ?
     మనిన, – నా బ్రహ్మచారి కి ట్లనియె, నతఁడు.200
వ. మహాత్మా! నీప్రసాదంబున విశ్వాంతరంగం బైనమార్గంబు గంటి;
     సంసారసీమాంతం బయ్యెఁ; బొందవలసిన నిశ్చయార్థంబుఁ బొందితి.
     ననిన, నట్లగాత, సుఖంబుండు, మని చూడాల తనపురంబునకుం జని
     కతిపయదినంబులకుఁ గ్రమ్మఱ బ్రహ్మచారి యై ఖిన్నముఖారవిందంబు
     తోఁ బొడసూపినం గని, శిఖిధ్వజుం — డిది యేమి? యింత ఖేదం
     బేల వచ్చె? నని యడిగిన, – కుంభుం డి ట్లనియె.201