పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

వాసిష్ఠరామాయణము

     క్షాసక్తియు విడువు మీఁద నర్కకులేశా.118
వ. ఆందు మనోవాసనలు విడిచి నిర్మలంబు లగుగుణమైత్ర్యాదివాసన
     లం గీలింపుము. తద్వర్తనంబుం దెలిసి యవియునుం బరిత్యజించి,
     శాంతి వహించి చిన్మాత్రవాసనల సుఖించి, మనోబుద్ధిసమన్వితం బైన
     తద్వాసనాపరిత్యాగంబు చేసి, సుస్థిరసమాధానంబున నెద్ది తెలిసిన
     దదియునుం బరిత్యజించి, మనోవృత్తిం జేసి సర్వదృశ్యంబును విడుచున
     ప్పు డెద్ది శేషించె, నదియ మోక్షం బనంబడు. నట్టిపుణ్యాతునకు సుజ్ఞా
     నకర్మంబులు సేసిననుం జేయకుండినను విరోధంబు లేదు. మఱియును.119
క. పాయక నిర్వాసన ని
     శ్శ్రేయోధికుఁ డైనయతనిచిత్తమునకు నా
     ధేయంబును మఱి యందును
     హేయంబును ననఁగఁ గలదె యినవంశనిధీ!120
గీ. యుక్తి సంచరింప నోపిన సంసార
     మయము గోష్పదాభ మయి యణంగు;
     యుక్తి లేక తిరుగునుద్వృత్తునకు మహా
     ర్ణవముభంగి నతనిఁ దివిరి ముంచు.121
వ. ఈయర్థంబున ముదితాత్ములగుపూర్వజులచేత వినంబడు పావనంబు
     లగుకచగాథలు గల వత్తెఱంగు తేటపడ నాకర్ణింపుము. బృహస్ప
     తినందనుం డగుకచుం డాత్మసమాధిం దెలిసి యొక్కనాఁ డేకాంతం
     బున నుండి గద్గదకంఠుం డగుచు మధురంబుగా ని ట్లనియె.122

కచుని గాథ

సీ. ఏమి సేయుదు? నింక నెక్కడ బోదు? నే
                    నేమి చేపట్టుదు? నేమి విడుతుఁ?
     బ్రళయకాలాంబుధిభంగి విశ్వంబున
                    బ్రహ్మంబు నిబిడమై పరఁగుచుండు.