పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

101

     పితామహుండైన బ్రహ్మ యుద్భవిల్లె. బరమాత్మ యైనయతనికి జనన
     మరణంబు లెందునుం బొందవు. మిథ్యాభావనలం గల వని సెప్పం
     బడు; నట్లుగావునఁ దృష్ణాభుజంగకంచుకం బగుసంసారాడంబరంబు
     విడువుము.67
క. విను మజ్ఞానాంశము లగు
     ధనదారసుతాదులందుఁ దనికెడు దుఃఖం
     బును సుఖమును, నిక్కంబై
     చను నెద్ది సుఖంబు తలఁప జనవరతిలకా.68
గీ. మూర్ఖు లగువారితలఁపుల మోహ మొదవి
     యేమివస్తుల భోగింప నిశ్చయింతు
     రాత్మవిదు లైనవారల కరసి చూడ
     నవియ వైరాగ్యహేతువు లై జనించు.69
క. చే తప్పి చనిన కార్యము
     లాతతమతి విడువు, నీకు నబ్బినసుఖముల్
     ప్రీతిన్ గైకొను సంవి
     చ్చాతుర్యుఁడ వగుము రామ సంసారమునన్.70
గీ. శూన్య మగుట గాంచి శోకింప రెన్నఁడు,
     నమరవనఫలాదు లబ్బె నేనిఁ
     జిత్తమునను వాంఛ సేయ రుత్తము లగు
     వారు, సూర్యునట్ల వసుమతీశ.71
వ. అనిన విని రఘూత్తముం డి ట్లనియె.72
క. ఈసృష్టియొక్క విధమే
     భాసురముగ నెట్లు పెక్కుభంగుల నగునో
     యీ సందు తెలియఁజెప్పుము
     భూసురవరతిలక చిత్తమున కిం పెసఁగన్.73