పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వ్యజనానిలంబుచే వదలునే తాపంబు రమణునిశ్వాసానిలమునఁ గాక
పల్లవంబులచేతఁ బాయునే తాపంబు వల్లభుకరపల్లవములఁ గాక
హిమవారిచే శమియించునె తాపంబు వరుశరీరశ్వేదవారిఁ గాక
పూఁదేనియలచేతఁ బోవునే తాపంబు బ్రియునునుఁబలుకుఁదేనియలఁ గాక
యీచకోరాక్షులకు వీరి నింక నేయు, పాయమున విభుఁ గూర్తుము పోయి వేగ
తెలియఁ జెప్పంగ వలయు హేతిప్రహేతి, దైత్యకులనాథులకు నని తలఁచువేళ.

37


క.

విరహిణు లగుపద్మినులకుఁ, బరితాప మొనర్చుకుముదబాంధవుమీఁదన్
గర మలిగి వచ్చుకైవడి, నరుణప్రభతోడ నీరజాప్తుఁడు తోఁచెన్.

38


వ.

అంత నిజస్వాంతంబునకుఁ గొంత ధైర్యంబు నూలుకొలిపి యే నన్నివిధంబుల వీరి
మనోరథంబు సఫలంబు గావించెద నీవు బెగడక సముచితప్రకారంబులఁ బ్రొద్దు
గడుపు మని రత్నవతి నతిప్రయత్నంబునం గన్యకారత్నంబులకడ నియమించి
కదలి కదళిక సమీపంబునం దపంబు సలుపు హేతిప్రహేతులకడకుం జని వారల
కుం జాగిలి మ్రొక్కి కృతాంజలియై.

39


సీ.

చెలులు గొల్వఁగ సుకేశియు మిత్రకేశియు ధననాథుతోఁట కేగినవిధంబు
పుష్పితచంపకభూమీరుహచ్చాయ ననవింటివేల్పు నోమినవిధంబు
వనవిహారేచ్ఛ వచ్చినవాని నొక్కచక్కనిరాకుమారుఁ జూచినవిధంబు
మరలి గేహము సొచ్చి విరహసంతాపవేదనలచే మిగుల నొచ్చినవిధంబు
విన్నవించిన విని దైత్యవిభులు గొంత, తడవు చింతించి కలన సుత్రాము విఱుగ
దోలి మందరగిరి నున్న దుర్జయక్ష, మారమణుఁ గాఁగ నా రాకుమారు నెఱిఁగి.

40


క.

ఆదివిజయంబు గైకొనె, నాదివిజబలంబు భగ్నమైపోవ నతం
డీదొరకు మత్తనూజల, నీ దొరకుట భాగ్య మనుచుఁ గృతనిశ్చయులై.

41


చ.

కదళిక యిచ్చటం దడవుగా నిలువం బనిలేదు పొమ్ము వే
కదలి కలాపకుంతలలకంతుశరవ్యధ మాన మెల్ల గ్ర
క్కదలి కలంగకుండఁ దమకాంతునిఁ దెచ్చెద మన్న మాఱులే
కదలికఁ బెట్టుదున్ శుకపికాదుల నింక నటంచు వేడుకన్.

42


క.

హేతిప్రహేతులకు నా, నాతి నమస్కృతులు చేసి నగరమునకుఁ దా
నేతెంచి తెలియఁ జెప్పె ల, తాతన్వులతోడఁ గూర్మితండ్రులపలుకుల్.

43


క.

చెప్పిన నప్పలుకులు విని, తెప్పిఱి సమ్మోదవారిధిం జంద్రముఖుల్
తెప్పలఁ దేలిరి నెచ్చెలు, లప్పుడు పల్లవితహృదయలై తమలోనన్.

44


గీ.

ఇన్నివిధముల నీరాచకన్నియలకుఁ గీడు చేసినమన్మథకేతు వప్ర
యోజనం బయ్యె నెక్కెడుతేజి వ్యర్థ, మయ్యెఁ జాపంబు నిష్ఫలం బయ్యె ననుచు.

45