పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నసురవల్లభుం బంపి నిజస్వామివాక్యంబు దలంచి యీశానుండు శాశ్వతైశ్వర్యం
బున నేలుయశోవతీపురంబునకు దూరంబున నమస్కారంబు చేసి దివిజరాజ్య
భోగంబు లనుభవించుచు సుఖంబున నుండిరి తరువాత వారివలన మహాద్భుత
చరిత్రంబు సంభవింపం గలదు విశ్వంభరా యిటు దుర్జయుండు జయపటహఢా
న్నినాదంబు మదవదహితహృదయవ్యధావిధానంబు సంధింప గంధమాదనంబు
డిగ్గి మందరకూటంబున విడిసె నంత వసంతసమయసమారంభణంబులు విజృం
భించిన.

69


మ.

అవతంసీకృతశాతమన్యవజయుండై దుర్జయక్ష్మావధూ
ధవుఁ డర్పించినధూర్తకీర్తిసుషమాధావళ్యము ల్ముట్టుకొ
న్న విహారంబులు చూపఁగా వెఱచి లీనా లైనచందంబునన్
లవలేశంబును లేక పోయె మహి యెల్లన్ మంచుసంచారముల్.

70


గీ.

గహనలక్ష్ములు తమపూర్వకనకభూష ణములు దిగఁద్రావి మధుమాసరమణుఁ డిచ్చు
మణులసొమ్ములు దాల్చినమాడ్కిఁ బొడమెఁ బండుటాకులు డుల్లినఁ బల్లవములు.

71


క.

తలిరాకుమోవులు గదల, నలికలరవకైతవమున నాలాపము సే
యులతారమణులపలువరు, సలువలె మొనసెం జిగుళ్ళసందున మొగ్గల్.

72


క.

సుమవికసనమున లతికా, రమణులు మెఱసిరి గళ న్మరందం బనుతై
లమునఁ బరాగం బనుకుం, కుమఁ దోఁగి సమర్తపెండ్లికూఁతులమాడ్కిన్.

73


క.

తనపగతుకంఠమును బో, లె నటంచు రతీశ్వరుం డలిగి కత్తులబో
నునఁ బెట్టిన మూల్గెడివిధ, మునఁ బికము ప్రవాళమధ్యమున నెలుఁగించెన్.

74


సీ.

విరహచింతాగ్ని యివ్విధిఁ గెరల్పుదు నన్నపగిదిఁ బద్మపరాగ మెగయఁ గొట్టి
కామునిపడవాలు గానఁ బౌజులు సేయుగతి మధుపంబులఁ గదలఁ దోలి
తీవెలేమలచేత నీవిధిఁ గలయంపి చెల్లించుక్రియఁ దేనె సడల సుడిసి
తనపగ సాధింపఁ గని మెచ్చి బుజ్జగించినరీతి శఖులపించెములు నిమిరి
తెరువు నడిచిన దాహంబు దీఱ గిరిఝ, రాంబువులు గ్రోలుకరణి రతాంతతాంత
వనితలకుచాగ్రముల ఘర్మవారిపూర, మడఁగ విహరింపఁ దొడఁగె మందానిలంబు.

75


వ.

ఇత్తెఱంగున సకలజగజ్జనానురంజనకరపరిమళపరంపరాసంపత్సమాసం బైనవసంత
మాసంబున రాజకీరమాలికలు పచ్చతోరణంబులుగా నిరంతరపరాగపటలంబులు
మేలుకట్టులుగా మల్లికాముఖవల్లీమతల్లికలు రాల్చినవిరులు ముత్యాలముగ్గులుగా
సరసకిసలయకుసుమఫలభరితంబు లైనగుజ్జుమామిళ్ళు బూజగుండలుగా మరకత
మణిమయూఖములడాలు విడంబింపంజాలుమరువంపుమళ్ళు జాజాలపాలికలుగా