పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఈపగిదిన్ మహేంద్రుఁడు మహీతలనాథునితోమరంబుచే
నేపరి నిల్వ లేక పడియెన్ మదనాగముమీఁదనుండి తాఁ
దాపసరాజమౌళిఁ గని దండము వెట్టనినాఁటిపాపమున్
బాపఁగ నద్రి యెక్కి భృగుపాతము చేసినభంగి దోఁపఁగన్.

58


సీ.

దర్పంబు మాని యథాయథలైరి నిలింపులు సిద్ధులు కింపురుషులు
లావు చాలించి చెల్లాచెదరైరి సారణులు గుహ్యకులు తురంగముఖులు
గర్వంబు విడిచి కకాపిక లైరి మరుత్తులు విద్యాధరులు దనుజులు
బంటుతనము డించి పంచము పాడైరి గరుడులు యక్షులు గగనచరులు
గౌరవము దక్కి పంచబంగాళమైరి, సాధ్యగంధర్వతుషితభాస్వరపిశాచ
విశ్వవసుకిన్నరాదికవివిధదేవ, యోను లత్యంతభయకంపమాను లగుచు.

59


క.

అప్పుడు గోత్రవిఘాతి క, కుప్పతియుతుఁడై ధరిత్రిఁ గూలి వసించెన్
ముప్పిరిగొనియెడివగ సడి, చప్పుడు గాకుండఁ బ్రాగ్దిశాకోణమునన్.

60


క.

ధరణీకాంచనధరణీ, ధరము విడిచి యింద్రుఁ డున్నఁ దత్ప్రాగ్దేశా
న్తరమున మీఁదటివిస్మయ, కర మైనచరిత్ర మొకటి కాఁ గలదు సుమీ.

61


చ.

అట రణరంగనర్తితహయీనటి దుర్జయభూమిపాలధూ
ర్జటి యెఱమన్ను పూసినహిరణ్యపుబూదియ దెచ్చి వన్నె దా
ల్చుటకు నిజప్రతాపశిఖిలోపల వైచినరీతిఁ గ్రొత్తనె
త్తుట నిబిడంబుగాఁ గలయఁ దోఁగిన మేరువు డిగ్గి శాంతుఁడై.

62


క.

అరిగె దరీముఖరితకి, న్న రీవిపంచీవినోదనమునకు శిఖరాం
తరపరివృతచందనతరు, మరుదోదనమునకు గంధమాదనమునకున్.

63


వ.

అరిగి తద్గంధమాదనకటకంబునం దనకటకంబు విడియించి వినోదార్థంబుగా
నహరహంబును హితసహితుండై మిహిరకరనివహదురవగాహంబు లైన సహకార
మహీరుహంబులవాడలనీడలఁ గ్రీడల సలుపుచు సామిసంపుల్లమల్లీవల్లీమతల్లికాకు
డుంగంబులప్రోవుఠావులం దావులు గ్రోలుచు సముత్తుంగశృంగశృంగాటకనటన్మ
యూరంబులకోపులతీపులం జూపులు నిలుపుచు విశంకటశిలాపట్టఘటనజర్ఝరనిర్ఝరీ
కణధురంధరమంధరగంధవాహంబులపొలయికల నలయికలు దీర్చుచుం గొన్ని
వాసరంబులు నిలువ నొక్కనాఁడు తాపసవేషధారు లైనపెద్ద లిద్దఱు వచ్చి
నచ్చినభృత్యామాత్యులు దొరలు దండనాథులుం గొలువ నలువచెలువు గెలువం
జాలుకవ శేఖరులవాక్యస్తబకంబులవలె విలువలేనిరత్నంబులు దాపించిన కాంచన
సింహాసనాసీనుండై పటమంటపంబులో నున్నమరున్నాయకదుర్జయు దుర్జయుం
గని యిట్లనిరి.

64