పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

వరాహపురాణము

ద్వాదశాశ్వాసము

క.

శ్రీకారసదృశకర్ణ, స్వీకృతకవితాప్రవాహసితఫేనగుళు
చ్ఛాకారమౌక్తికస్వ, చ్ఛాకల్పా యీశ్వరక్షమాధిపునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుఁడు పృథివి కి ట్లనియె నట్లు రుద్రమహీమోద్ద్యోతకం
బైనశక్తిత్రయచరిత్రంబు చెప్పితి నింక సకలపాతకనివారణకారణప్రభావం బైన
రుద్రవ్రతావిర్భావంబు చెప్పెద మున్ను మూఁడవసృష్టిసమయంబున నలువ తన
వలన జనించినపింగళాక్షుండును నీలలోహితుండును నైనరుద్రునిం జూచి ముద్ర
సావేశంబున నిజస్కంధదేశంబున నిలిపి కపాలిరుద్రనగ్నకేదారసువ్రతాది
కంబు లైనభవిష్యన్నామంబులు గలుగు నానాధర్వణమంత్రంబులచేత నైదవ
ముఖంబునఁ బ్రహసించి జగద్రక్షణంబు గావింపు మనిన నీలలోహితుండు తన్ను
ననుచితం బైనకపాలినామంబునం బిలిచినకతంబున.

2


క.

కలుషించి విరించిభుజ, మ్ములు ద్రొక్కి తదూర్ధ్వశిరము పుడికెఁ గరరుహాం
చలమునఁ దరుశాఖలపై, నిలిచి ఫలము చిదుమురీతి నిర్ఘృణవృత్తిన్.

3


క.

నిష్ఠురహరవామకరాం, గుష్ఠనఖవిలూనమస్తకుం డైనసుర
జ్యేష్ఠుని నప్పుడు చూచి గ, రిష్ఠాద్భుతభయములన్ మరీచిప్రభృతుల్.

4


క.

తనువున గళమున మస్తక, మున భీకరభిన్నవర్ణములు గలయందుం
గని యెఱుఁగనివిపరీతపుఁ, దనయునిజన్మంబు తండ్రితలపై వచ్చెన్.

5


మ.

అని భాషింపఁగ స్రష్ట శిష్టచతురాస్యం బైనదేహంబుతో
ననిలక్రూరనిపాతభగ్నశిఖరంబై నాల్గుగంబాలతో
డనె కన్పెట్టెడుపైఁడిమేడవలె నుండం దత్పయోజాతగ
ర్భునిమూర్ధంబును సంతతరక్షరదసృక్పూరాతిఘోరాకృతిన్.

6