పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మూర్తుల నమ్మహానుభావుండు విశ్వప్రపంచంబు నిండి విహరించు నది నీవు నన్నడి
గినప్రశ్నంబునకు నుత్తరంబు.

124


క.

నావుడు విని ముదితాత్మక, యై వసుమతి వెనుక నాప్రియవ్రతుఁడు సుధాం
ధోవాచంయమవచనము, దా విని యెవ్విధిఁ జరించె దంభకిరీంద్రా.

125


ఉ.

ఆనతి యిమ్మటన్న వసుధా వసుధామనిభప్రభాధికుం
డైనప్రియవ్రతుండు ముని నంతట వీడ్కొని పోయి దేవపూ
జానియమావసక్తయతిసంతతిసంతతవాద్యమానఘం
టానిబిడీకృతతాత్మనికటం బగు వేదసరస్తటంబునన్.

126


శా.

నిష్ణాతత్పరుఁ డై చతుర్దహనకుండీమధ్యవేదిం బదాం
గుష్ఠాగ్రంబున నిల్చి నిశ్చలత నర్కుం జూచుచున్ దైవత
శ్రేష్ఠున్ విష్ణుని బ్రహ్మపారనుతి మెచ్చించె న్సముద్యత్తపో
నిష్ణాతృప్రవరుం డితం డనఁగఁ బొందెన్ ముక్తిలీలావతిన్.

127


గీ.

ఇది ప్రియవ్రతవృత్తాంత మింక నొక్క, పూర్వరాజన్యకథ విను పుణ్యగుణవి
ధేయుఁ డశ్వశిరోనామధేయుఁ డైనరాజు గలఁడు వదాన్యత్వరాజరాజు.

128


మ.

ధవళాంభోరుహనేత్ర వాఁడు హయమేధంబున్ ఘటింపం దలం
చి విసంఖ్యధ్వజినీపరంపర నుదీచీప్రాచ్యవాచీప్రతీ
చ్యవధిక్షోణికి యజ్ఞముక్తహరిఁ గాయం బంపి కావించె జా
హ్నవికిన్ శాత్రవకంఠరక్తనదికిన్ సాపత్న్యసంవాదమున్.

129


శా.

ఈరీతిం గకుబంతముల్ గెలిచి తా నేకాగ్రబుద్ధిన్ వచః
శ్రీరేఖాచతురాస్యు లైనమును లార్త్విజ్యంబు గావింప నా
నారాజన్యులు భృత్యులై మెలఁగ భండారంబులం గల్గుబం
గారంబున్ వెదచల్లె విప్రులకు వేడ్కన్ వాజిమేధంబునన్.

130


వ.

ఇబ్భంగి సాంగంబుగాఁ దురంగమేధాధ్వరంబు చేసి నిజభుజప్రతాపతపనచ్ఛవిచ్ఛ
టాసిందూరితదిక్కరిశిరుం డశ్వశిరుండు శుద్ధాంతకాంతాసహస్రంబులతోడ నవ
భృతస్నానం బాచరించి కృతార్థుండై రెండవమహేంద్రుండునుం బోలె భూసు
రాశీర్వాదంబులు సౌవిదల్లసాహోనినాదంబులు వందిజనపఠ్యమానబిరుదగాథార
వంబులు ధవళచామరధరకురంగేక్షణాకరకంకణక్వణనంబులు మాగధమధురగా
నంబులు భేరీమృదంగదుందుభిధ్వానంబులుఁ గ్రందుకొన సభామండపంబునకు
వచ్చి నవరత్నసింహాసనంబున నాసీనుం డయ్యె నయ్యవసరంబున.

131