పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈనోములలో నొక్కటి, యే నియతిం జేయువారి కెన లే దనినన్
మానవనాయక యిఁకఁ బది, యేనుం జేసిన ఫలంబు లేమని చెప్పన్.

93


మ.

అని వాతాపిహరుండు చెప్ప విని భద్రాశ్వుండు ముద్రాద్భుతం
బును సంతోషముఁ జేయుపూర్వచరితంబుల్ సృష్టిలో మీరు చూ
చినవైనన్ మఱి విన్న వైన జలరాశిప్రాశనా చెప్పు మ
న్నన నన్నన్ మునిరాజశేఖరుఁడు నానావైఖరీమౌఖరిన్.

94


క.

అద్భుతము లనిన సకలజ, గద్భరితుఁడు శౌరికథల కా కిలఁ గలవే
చిద్భాసురుండు బ్రహ్మస, ముద్భూతుఁడు నారదుండు ము న్నొకవేళన్.

95


శా.

శ్వేతద్వీపము చూడఁ బోయి యెదుటన్ శ్రీవత్సవత్సాఢ్యులన్
శాతాస్యంబుజశంఖచక్రకరులన్ దాపింఛరింఛోళిజీ
మూతచ్ఛాయశరీరులన్ వికసితాంభోజాతులన్ బల్వురన్
జేతోజాతగురూపమాకృతులఁ జూచెన్ జూచి సాశ్చర్యుఁడై.

96


క.

వీరలలో నారాయణు, నేరీతి నెఱుంగువాఁడ నే నని సలిపెన్
శౌరి గుఱియించి తప మతి, ధీరతమై బహుసహస్రదివ్యాబ్దంబుల్.

97


శా.

అంత న్వారిధికన్యకావిభుఁడు ప్రత్యక్షత్వముం బొంది నీ
వెంతేఘోరతపంబు చేసితి మునీ యేరోరికల్ గోరి పొం
దింతుం జెప్పుము తత్సమిహిత మనన్ దేవా భవన్మాయ స
ర్వాంతర్వ్యాపిని నాకుఁ జూపు కృపతో నన్నం బ్రసన్నాస్యుఁడై.

98


గీ.

మునికులాగ్రణి యీనీట మునుఁగు మన్న, మునిఁగి లేచినమాత్రలో మోహనాంగి
కాశిభూపాలకునికూర్మికన్య చారు, మతి యనెడుపేరఁ బుట్టెఁ గ్రమక్రమమున.

99


క.

కొప్పును రోమావళియుం, గ ప్పెక్కెను మోవిఁ బాదకమలంబులఁ గెం
పుప్పతిలెఁ బిఱుఁదుఁ గుచములు, నప్పడఁతికి మిగులఁ బొదలె యౌవన మైనన్.

100


సీ.

వదరుమాటలు గాక వచ్చునే సరిచేయఁ గిన్నరకాయ లీచన్నుఁగవకు
పూదెమాటలు గాక పొసఁగునే సరిచేయ బంగార మీనిర్మలాంగమునకు
పూఁతమాటలు గాక పోలునే సరిచేయఁ గర్పూర మీతనూగంధమునకు
జల్లిమాటలు గాక చెల్లునే సరిచేయ సవరంబు లీకేశజాలమునకు
ననుచుఁ దనవిలాసంబును జనులు వొగడఁ, జక్కఁదన మెల్ల నొకరాశి కెక్కె ననఁగ
రతీమనోహరభాగ్యదేవతయ వోలె, బాలికామణి కన్నులపండు వయ్యె.

101


క.

ఆసతిఁ గాశినృపాలకుఁ, డౌసీనరపతికి సిబికి నర్పించుటయున్
వాసంతసమయకుసుమిత, వాసంతీమంటపముల వారు రమింపన్.

102