పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బైనయిమ్మహాకుశేశయంబు పరమపురుషవరశయం బగుటకు నసంశయంబు భూ
వల్లభా దీని నపహరింపం దలంచినయపరాధంబున నీదృగ్విధవ్యాధిబాధితుండవైతి
వింతియకాని యేతదరవిందసందర్శనంబునం గృతార్థుండ వైతివి రోగంబు వేగంబ
పాయునుపాయంబు విను మని మునిపుంగవుం డారోగ్యవ్రతం బుపదేశించినం
జేసి రాజవరేణ్యుం డనరణ్యుండు భాస్కరుని కారుణ్యంబున నగణ్యలావణ్య
గేహం బగుదేహంబు వడసె నింకఁ బుత్రవ్రతంబు వినుము.

82


క.

నృప శ్రావణకృష్ణాష్టమి, నుపవాసం బుండి వారిజోదరుఁ బూజిం
చి పిదపఁ దిలహోమము చే, సి పారణ హవిష్యమునన చేయఁగవలయున్.

83


గీ.

మాసములు పద్నొకం డీక్రమమున నడిపి, మీఁద నాషాఢకృష్ణాష్టమిదినమున
వ్రతి యథాశక్తిఁ గాంచనరచిత మైన, కృష్ణమూర్తిద్వయము దాన మిచ్చెనేని.

84


క.

ఇద్ధరణిఁ బుత్రపౌత్రస, మృద్ధులు భువనప్రసిద్ధు లిహపరసుఖముల్
సిద్ధించు నిందుకుం దగ, బద్ధస్పృహతోడ విను ముపాఖ్యానంబున్.

85


శా.

సహ్యాపత్యము సూరసేనుఁ డనువిశ్వక్ష్మావధూభర్త మున్
వాహ్యాళీగతి సర్వదిఙ్ముఖములన్ సాధించియున్ సంగర
ద్రుహ్యద్వైరులఁ గీటడంచియును బుత్త్రు ల్లేనియీసౌఖ్య మ
గ్రాహ్యం బంచుఁ దపంబు చేయ నరిగెం బ్రాలేయపుంగొండకున్.

86


క.

అరిగి తదగ్రస్థలమునఁ, బెరిఁగినగహనంబులోన భీకరమృగముల్
మరిగి చరింప భవాంబుధి, తరి గిరిశు నుమాసమేతుఁ దలఁపుచు నుండన్.

87


సీ.

మిన్నులపైఁ బాఱు వెల్లి ముత్యపుజల్లి చలువలబచ్చు చెంగలువకచ్చు
పుఱియలచౌకీలు పొలు పైనతడపాలు పన్నగవిసరము బన్నసరము
ఒలుకులబూది క్రొవ్వలపులజవ్వాది వేలిమిమెకము పిసాళిశుకము
చాఱలరెంటెంబు సన్నంపుగింటెంబు భానుపండులచాలు పసిఁడినూలు
జమునిశిరమును మణినూపురమును మెఱయ, మురువుగలిగినతొడుకువావురము నెక్కి
కరుణ నయనాంబుజంబులఁ గడలుకొనఁగ, నెదుటఁ గనుపట్టె నర్ధనారీశ్వరుండు.

88


క.

అప్పుడు మది నానందము, ముప్పిరిగొన నమక చమక ముఖమంత్రంబుల్
చెప్పుచు మ్రొక్కుడు భూవరు, నప్పర మేశ్వరుఁడు వరము లడుగు మటన్నన్.

89


మ.

సుతుల వేఁడిన నాసుధాకరకళాచూడుండు కృష్ణాష్టమీ
వ్రత మాద్యంతము నాన తిచ్చి చనియెన్ రాజన్యుఁడున్ భక్తిసం
గతిఁ జేసెన్ దనకూర్మిరాణివలనన్ గాంచెన్ జతుర్లోకస
న్నుతవిశ్రాణనచాతురీదివిజధేనున్ వీరసేనున్ సుతున్.

90