పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ష్ఠించి షోడశోపచారంబులు సలిపి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయా
వసరంబున సర్వంసహాసురులకుం బాయసాహారంబు సదక్షిణంబుగా నొసంగి భృ
త్యవర్గంబునుం దానును భుజియించిన నపుత్రత్వదారిద్య్రాదిదుఃఖంబులం బాసి
విద్యావిత్తసంపన్నుండై సౌఖ్యంబు లనుభవించి తదనంతరంబున దేహావసానం
బున ముప్పదియాఱుమన్వంతరంబులు విష్ణులోకంబున వసియించి పిదప మర్త్యం
బున సప్తజన్మంబులు జన్మించు నిమ్మహావ్రతాచరణంబునకు నొక్కయితిహాసంబు
చెప్పెద నాకర్ణింపుము.

50


క.

యదువంశోద్భవుఁ డైనవ, సుదేవజనవల్లభుండు సూనులఁ బడయన్
మదిఁ గోరి చేసెఁ దనభార్య దేవకియుఁ దానుఁ బెక్కువ్రతములు నియతిన్.

51


గీ.

ఇవ్విధంబున వ్రతము లనేకములు స, లిపిన సంతానలాభంబు లేమి నామ
హీశ్వరుఁడు సతి కి ట్లనియె శశికాంత, మణిమయైకాంతశుద్ధాంతమఁదిరమున.

52


సీ.

లోలాక్షి పొదుగుళ్ళలో నున్నసుతుచిన్నిచిన్నినవ్వులు నిరీక్షించువారు
రమణి తనూజాతుఁ డమృతంబ చిలుకఁ బల్కెడుముద్దుపల్కు లాలించువారు
తలిరాకుఁబోఁడి విందులువిందు లనఁ బాఱుతెంచునందనుఁ గౌఁగిలించువారు
బింబోష్ఠి తనయుండు పెడము పెట్టినవేళ నిష్టార్థములు దెచ్చి యిచ్చువారు
రాజబింబనిభాస్య గారాపుఁబట్టిఁ, దిట్టి తిట్టించుకొని ప్రమోదించువారు
శ్రీవధూటీ కళత్రుగఱించి పూర్వ, జన్మమున నేమి తపములు సలిపినారొ.

53


మ.

అని చింతింపుచునుండ నారదుఁడు బ్రహ్మజ్ఞావసంవేది వ
చ్చె నభోవీథి నటజ్జటాకిసలయశ్రేణు ల్విపంచీపికా
దినినాదంబులు భూతిపుష్పరజముల్ దీపింపఁగా వంశవ
ర్ధనసంతానఫలప్రదానకరసంతానంబుచందంబునన్.

54


క.

ఆసమయంబున విభుఁడు య, థాసముచితపూజనములు తాత్పర్యముతోఁ
జేసిన సంతోషించి మ, హాసంయమి సస్మితాననాంభోరుహుఁడై.

55


క.

శాంతివిభూషణ లక్ష్మీ, కాంతుఁడు నీమీఁదఁ గరుణ గలఁడు సతతమున్
సంతానము లేమికి మది, చింతింపకు మేలివార్త చెప్పెద వినుమా.

56


సీ.

నిన్న విశ్వంభర నిర్జరేశ్వరసభాగారంబునకు వచ్చి కంసనరక
మురభోజపాంచాలకురుజరాసంధులు మొద లైనధూర్తుల మోవలేను
రక్షింపుఁ డనుచు నాక్రందింప సంక్రందనాదిదిక్పాలకు లబ్ధిశాయి
కడ కేగి యేతత్ప్రకారంబు విన్నవించిన నారమాభర్త చిత్తగించి