పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మును ధాత కల్పాంతమున నిద్ర దెలిసి లోకవినిర్మితికి వగ గాన లేక
సంక్షుబ్ధుఁ డైన రజస్తమోగుణము లుద్రేకంబుఁ జూపె నారెంట రక్త
నీలవర్ణుండు త్రినేత్రుండు తేజఃప్రభావధూర్ధరుఁ డొక్కబాలకుండు
జనియించి మ్రోల రోదనము చేసిన రుద్రుఁ డనుపేరు పెట్టి పుత్రా చరాచ
రంబు సృజియింపు మన గాఢాంబుపూర, మధ్యమంబున మునిఁగి నిర్మాణశక్తి
తనకు సిద్ధించుకొఱకునై తపము చేయఁ, బూనె నారాయణునిమనంబున గుఱించి.

36


క.

ఈరీతి రుద్రుఁ డరిగిన సారసగర్భుండు మానసంబునఁ గనియెన్
సారాచారులఁ బుత్రుల, వారివలన జగము సంభవం బైనతఱిన్.

37


సీ.

కమలాసనప్రీతిగా దేవతలు సప్తతంతువు గావింపఁ దపము మాని
వారిపూరంబు వెల్వడి వచ్చి రుద్రుండు యజ్ఞకోలాహలం బాలకించి
నను మీఱి యీభువనంబు లెవ్వండురా సృజియించి మఖము చేయించువాఁడు
కొట్టివైచెద నని కోపించి నిజతనూద్భవ మైనభూతభేతాళయోగి
శాకినీడాకినీపిశాచములు పెక్కు, వేలు లక్షలు కోటులు విండ్లు గదలు
ముసలములు ముద్గరంబులు మొదలుగా న, నేకశస్త్రాస్త్రములు ధరియించి కొలువ.

38


క.

క్రతుశాలఁ జొచ్చె నత్యు, ద్ధతి నోంతత్సద్గుణాన్వితంబుఁ జతుర్విం
శతిహస్తమాత్రమును నై, శితశరములు గురియుధనువు చేతం గొనుచున్.

39


వ.

ఇట్లు సవనవాటంబు పాటపరిం జొచ్చి నిరాఘాటపరాక్రమంబున శక్రముఖ్యాఖిల
నిలింపపరంపర వెంపరలాడి భగునికన్నులు గెలికి పూషార్కునిపండ్లు డుల్ల మొత్తి
యజ్ఞపురుషునిబీజంబులు దునిమిన నతండు మృగరూపంబునఁ గారడవికిం బఱచె
నంత భారతీకాంతుండు రౌద్రసమున్నిద్రు రుద్రుం జేరి సాంత్వనవచనంబుల శాంత
స్వాంతుం గావించి కవుంగిలించి దేవతల విలోకించి మీర లమ్మహానుభావు సంస్తు
తించి కృతార్థులు గండని పలుకుటయు వారు సింధురాంధకజలంధరసప్తతంతు
కంతుకృతాంతసంహరణాదిభూతభవిష్యద్వర్తమాననానావిధజయాంకమాలికలను
వర్ణించిన మెచ్చి వేఁడినవరంబు లిచ్చె నట్టిరుద్రునిజన్మదినంబు గానఁ జతుర్దశి
నాఁడు పశుపతిం బూజించి కథ విని గోధూమాన్నంబు భుజియించినమానవులకు
భోగమోక్షంబులు గలుగు వసుంధరాధ్యక్ష యింకఁ బంచతన్మాత్రలు పితరులై
పుట్టినతెఱంగు వినుము.

40


గీ.

మును చరాచరనిర్మిత్సవనజభవుఁడు, మానసంబునఁ బంచతన్మాత్రలు వెలి
చేసి నిశ్చలయోగవిద్యాసమేతుఁ, డై పరంజ్యోతి భావించునవసరమున.

41


మ.

నయనాశ్చర్యముగా నిజాంగమునఁ దన్మాత్రల్ పిబామ స్తరా
మ యటంచుం బురుషాకృతుల్ మెఱయ జన్మం బైన నాభారతీ