పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మంత్రవిదులకు నౌషధమణిసమేతు, లకు భయంపడి తిరుగుఁడు సకలసురవి
హంగపతులకు దాయాదులై నిలువుఁడు, గాలి నియతాశనంబుగాఁ గ్రోలి మనుఁడు.

75


క.

అకరుణతో మీరు బుభు, క్షుకులై భూలోక మతలకుతలముగాఁ జే
యక పోయి వసింపుఁడు త, ప్పక యిచ్చితి నతలవితలపాతాళంబుల్.

76


చ.

అని పరమేష్ఠి పంప నతలాదిపదంబులకున్ భుజంగముల్
పని వినె వానిసంభవము పంచమి గావున భక్తి నద్దినం
బున లవణామ్లముల్ వెరసి ముట్టక పాముల నాలపాల మ
జ్జన మొనరించుపుణ్యులకు సర్పభయంబులు లేవు భూవరా.

77


వ.

సర్వతత్వంబులకుఁ బరమం బైనపురుషునివలన సత్వాదిగుణాత్మకంబై పరఁగునవ్య
క్తంబు సంభవించె నప్పరమపురుషావ్యక్తంబులవలన నడుమ మహత్తత్వం బవతరించె
మహత్తత్వంబునకు నహంకారసంజ్ఞయుఁ బరమపురుషునకు శివనారాయణాభిధానం
బులు నవ్యక్తంబున కుమారమానామంబులు ప్రవర్తిల్లు నేతద్విధపరమపురుషావ్యక్త
సంయోగంబున నహంకారంబు గుహుండై జన్మించినచందం బింక వినుము బ్రహ్మ
మానసపుత్రు లైనమరీచిప్రముఖులసంతానక్రమంబున సుపర్వగంధర్వయక్షపక్షి
దనుజమనుజప్రభృతిసృష్టి వర్ధిల్ల దుర్ధర్షబలధూర్ధరులు విప్రజిత్తివిచిత్తిభీమాక్షక్రౌం
చాహ్వయంబులు వహించిన రాత్రించరులపరాక్రమంబునకు నిలువలేక చీకాకు
పడిననాకౌకసులం జూచి వాచస్పతి యి ట్లనియె.

78


ఉత్సాహ.

ఇంతవట్టు దేవసేన లెల్ల నేల నీశచీ
కాంతుఁ డొకఁడ బల్లిదుండు గాఁడు గాన నింక స
త్యంతశూరతాసనాథు దండనాథు మీరు ధీ
మంతు లైతిరేని చింత మాని బ్రహ్మ వేడుఁడా.

79


ఉ.

నావుడు వారు మంత్రివచనంబులఁ గార్యము నిశ్చయించి భా
షావరుపాలికిం జని నిశాటవరేణ్యుల బాధ చెప్పి దే
వా వలె మాకు నొక్కదళవాయి ధరాధరవైరికిన్ మహా
దేవచమూకదంబకపతిత్వము దాల్చుట బెట్టు గావునన్.

80


క.

అనవుడు విని వాకృతి యిప్పని నాచేఁ దీర్పఁ గాదు ఫాలాక్షిహుతా
శనకణదగ్ధపురత్రయ, దనుజునిచేఁ గాని దేవతావిభులారా.

81


మహాస్రగ్ధర.

అని వారల్ వెంట రాఁగా నరిగి సకుతుకుఁడై పురోభాగభూమిన్
గనియెన్ నక్షత్రమార్గగ్రహిళశిఖరశృంగాటకస్థాంధకస్ప
ర్ధినిరాఘాటప్రకాశద్విగుణసితిమదేదీప్యమానాత్మరోచి
ర్ధునికల్పీభూతసర్వద్రుమజలధిచతుర్ముద్రి నారాజతాద్రిన్.

82