పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శరధిలోపల ఫణమణికిరణపటలి, కాతరంగితశేషశయ్యాతలమునఁ
బవ్వడించినమూర్తి యేర్పడఁగఁ దాల్చె, సూకరాకృతి వీడ్కొని లోకభర్త.

57


క.

ఆలక్ష్మీపతిఁ గని శై, వాలస్థలినడుమ నున్న వనరుహకళికం
బోలఁగఁ దలపై నంజలి, గీలుకొలిపి సవినయమతి క్షితి నుతి సేసెన్.

58


ఉ.

నీరజనేత్ర వందనము నీకు రమారమణీపతీ నమ
స్కారము నీకు భక్తజనకల్పక దండము నీకు రక్షణో
దార జొహారు నీకు మహిమాంబునిధీ నతి నీకు నీకు జే
జే రజనీచరాన్వయవిజిత్వరసత్వరబాహువిక్రమా.

59


మ.

మును నీచూపినసూకరాకృతివిధంబున్ గర్భగోళస్థలో
కనికాయంబునుఁ జూచి యే నతిభయాక్రాంతాత్మ నైతిన్ జనా
ర్దన కాంతన్ శరణాగతన్ నిరపరాధ న్నన్ను మన్నించి తె
ల్పు నిరాఘాటకృపాసుధారసమయాంభోరాశిపూరంబునన్.

60


వ.

అని వినయపూర్వకంబుగా బహుప్రకారంబులం బ్రశంసించి మదీయపదంబులు
కేశవుండును జంఘలు నారాయణుండును నితంబంబు మాధవుండును గుహ్యంబు
గోవిందుండును నాభి విష్ణుండును జఠరంబు మధుసూదనుండును వక్షంబు త్రివిక్ర
ముండును హృదయంబు వామనుండును గంఠంబు శ్రీధరుండును వదనంబు హృషీ
కేశుండును నేత్రంబులు పద్మనాభుండును మస్తకంబు దామోదరుండును రక్షింతురు
గా కని వాసుదేవు మాసనామంబుల నంగన్యాసంబు చేసి వసుమతీసతి పునఃప్రణా
మంబు గావించి నిలిచినఁ బ్రసన్నుం డై వెండియు నప్పుండరీకాక్షుండు దాక్షిణ్య
లక్ష్మికి నాకరం బైనసూకరాకారంబు వహించి రత్నాకరకాంచిం గాంచి యి
ట్లనియె.

61


గీ.

అవనికామిని నీవు న న్నడిగినట్టి, ప్రశ్న మత్యుత్తమంబు దుర్లభము నిఖిల
వేదశాస్త్రార్థసారంబు వినుము సావ, ధానమతివై వచింతు విస్తరము గాఁగ.

62


క.

క్రమమున సర్గప్రతిస, ర్గములును మన్వంతరప్రకారంబులు వం
శములును వంశానుచరి, త్రములును లక్షణము లివి పురాణంబునకున్.

63


వ.

అం దనాదిసర్గం బెట్టిదనిని మొదలు నాకాశంబునుం బోలె నాతతంబై నిలుతు నట్టి
నావలన నణురూపంబున నొక్కబుద్ధి జనియించె నది సత్వరజస్తమోగుణంబులఁ
ద్రివిధంబై వేర్వేర తత్వరూపంబులు వహించె నందు సృష్టికిం బ్రధానం బైనమహ
త్తత్త్వంబు గల్పించితి నాతత్త్వంబున క్షేత్రజ్ఞుండు గలిగె నతనిబుద్ధిని మానసంబు
పుట్టె మానసంబున శ్రవణాదిహేతువు లగునర్థంబులు సంభవించె నర్థంబులవలన