Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

రామాయణ విశేషములు

ములు కలుగుననియు అయోధ్యలోని పెద్దరు పలికిరి: “రాజులేని రాజ్యము నాశనమగును. దొంగలు ఎక్కువగుదురు. వారి భయముచే రైతులు పంటలు పండించరు. శిక్షించువాడు లేనందున తండ్రిమాట కొడుకుగాని, మగనిమాట భార్యకాని వినరు. దేశములో ధనసంపద యుండదు. స్త్రీ పురుషులలో నీతివర్తన ముండదు. సత్యము పూర్తిగా దేశమందు మాయమగును. ప్రజలు తమ సభలను చేసికొనరు. ఉద్యానములు దేవాలయములు నిర్మించువారే యుండరు. యజ్ఞయాగాలెవ్వరును సేయరు. స్త్రీలకు దుర్మార్గులనుండి భయోత్పాతములు కలుగును. వర్తకులు బాటదొంగల భయముచే వ్యాపారాలు సేయరు. విజ్ఞానము వృద్ధికాదు. ప్రజలు మత్స్యన్యాయముచే పరస్పరపీడకు లగుదురు. నాస్తికులు ప్రబలుదురు."

(అరాజకమగు దేశమందలి ప్రజల కష్టనష్టములను గురించి తెలుసుకొనుటకు అయోధ్యాకాండలోని 62 సర్గను సాంతముగా చదువ వలెను).

రామాయణ కాలములో రాజులు ప్రజలనుండి వారి ఆదాయములో ఆరవభాగమును పన్నుగా గ్రహించుచుండిరి. (బలిషడ్భాగం : - అయో.75-25). ఉత్తమ రాజనీతిని తెలుసుకొనగోరిన, పైన రాముడు అరణ్య మందుండినప్పుడు భరతుడు రాగా అతనికి బోధించిన విషయములను గమనింపవలెను. (ఈ సందర్భములో అయోధ్యాకాండ 100-వ సర్గ సాంతముగా చదువవలెను.) రాము డిట్లనుచున్నాడు: “శూరులును జితేంద్రియులును విద్వాంసులును కులీనులును ఇంగితజ్ఞులును నగు వారిని రాజు మంత్రులుగ నియోగించవలెను. మంత్రాలోచన ఇతరులకు తెలియ కుండునట్లుగా చూచుకొనవలె. ఉత్తమభృత్యులను ఏర్పాటు చేసుకొనవలెను. ప్రజలను రాజు కఠినముగా శిక్షించగూడదు. ప్రజలు భరింప రాని పన్నులను విధింపగూడదు. శూరులను సమ్మానించి చేరదీయ