పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుత్రుదైన్యముఁ జూచి పొడము నయ్యలుక, వృత్రారిపై నల్గి వెస గంధవహుడు
ప్రజలనందఱ యాగపశువులభంగి, నిజగతి నూర్పులు నిగుడంగనీక
యుగ్రుఁడై తనుసంధు లొండొండ విఱుగ, నిగ్రహించినవారు నిశ్చేష్టులైరి
జగములన్నియు ననుష్ఠానము లేక, నిగమశాస్త్రంబులు నెరపంగ లేక
నిత్యకర్మంబులు నెరిఁ జేయలేక, యత్యంత శూన్యంబు లై యుండి రంత
ఘములు వెసఁ గొంచు బద్మాయతాక్షి, యలరెడువేడుక నాశ్రమంబునకుఁ
జనుదెంచి పల్లవశయ్యపైఁ గూర్మి, తనయుండు లేమికిఁ దద్దయు వగచి
యెక్కడఁ బోయెనో యీకుమారకుఁడు, అక్కటా యంచు నాయడవిలో నెల్లఁ
ద్రిమ్మరి కానక ధృతి దూలితూలి, క్రమ్మినశోకాగ్ని గడునేగుచుండ
భద్రేభగామినిపతియైనయట్టి, యద్రిచరశ్రేష్ఠుఁ డైనకేసరియుఁ
తనమనోవీథి నెంతయుఁ గాంచి చూచి, యనిలవరాత్మజుం డాయుదయాద్రిఁ
గందుకచంద్రికాగతి నొప్పు భాను, నందంబు గని ఫలంబను కాంక్షఁ జేసి
యాఁకటిషెల్లున నట నీవు లేమి, సోఁకోర్వలేక నాసూర్యబింబంబు
బండని తలఁచి దోర్బలశక్తి నెగసి, చండాంశుకడ కేగి జంభారిచేత
హతుఁ డయ్యెనని మఱి యటమీఁద నడుచు, కతయంతయునుఁ బ్రియకాంతకుఁ జెప్పి
యూరార్చి నెమ్మది నుండె నున్నంత, మారుతిచేతను మానముల్ దూలిఁ
బంధురతేజముల్ పరిపోయి దివిజ, గంధర్వయక్షరాక్షసముఖ్యు లెల్లఁ
గడుభీతితోఁ గూడి కమలసంభవుని, కడకేగి వినతులై కరములు మొగిచి
మొగి బహుస్వేదజంబులు నండజములు, నొగి జరాయుజములు నుద్భిజ్జములును
ననఁగ నాలుగుజాతు లైన జంతువులు, మును మమ్ము నిర్మించి ముదముతో మాకు
నాయువు లొగి నిచ్చి యాయుష్యములకు, వాయుదేవుని నధీశ్వరుఁ జేసి తెలమి
నాతండు మీయాజ్ఞ నఖిలజంతువుల, భాతిగా నది మొదల్ పాటించుచుండి
యేవెంటనో మాకు నింతనిగ్రహము, గావించె నిప్పు డాగంధవాహుండు
దేహగేహద్వారదేహళీ సీమ, నూహింపలోపడి యుండుటఁజేసి
యవరోధముననున్న యంతఃపురంబు, నువిదలయెలుఁగులు నూర్పుల నలవె
దేవప్రజానాథ దేవలోకేశ, మావిన్నపము విని మమ్ము రక్షింపు
వాయుపీడితులమై వచ్చినమాకు, నీయుగ్రనిగ్రహ మిప్పుడు వలదు
అని విన్నవించిన నావాక్యములకు, వనరుహగర్భండు వారితో ననియె
వినుఁడు మీ రిట్లైనవిధ మెల్లఁ దెలియ, ననిలున కంజన యనుదానివలనఁ